Pan Card: పూర్తిగా మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు జారీ.. ఏప్రిల్ 1 నుంచే..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు రూల్స్ పూర్తిగా మారనున్నాయి. కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారితో పాటు వివరాలు అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి కొత్త నిబంధనలు రానున్నాయి. దేశ ప్రజలను ప్రభావితం చేయనున్న ఈ నియమాల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

Pan Card: పూర్తిగా మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు జారీ.. ఏప్రిల్ 1 నుంచే..
Pan Card

Updated on: Mar 21, 2026 | 1:45 PM

ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు రూల్స్ మారబోతున్నాయి. పాన్ కార్డు దరఖాస్తు నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరింపులు చేసింది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ ముఖ్యమైన మార్పులకు సంబంధించిన వివరాలను సీఎస్‌సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉపయోగించి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఒక్క ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. ఇక ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. మార్చి 31 వరకు మాత్రమే ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అదనంగా మరో గుర్తింపు ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. త్వరలో రానున్న మార్పులు ఏంటో వివరంగా చూద్దాం.

అదనపు పత్రాలు అవసరం

ఇప్పటివరకు పాన్ పొందేందుకు ఆధార్ ఉంటే సరిపోయేది. కానీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆధార్‌తో పాటుగా మరో ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. దీంతో ఆధార్ కార్డు ద్వారా పాన్ పొందాలనుకునేవారికి ఇదే చివరి అవకాశంగా చెప్పవచ్చు. కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఆధార్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐటీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆధార్ ప్రకారమే పాన్‌లో పేరు ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులు ఆధార్ వివరాలు సరైనవని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫార్మట్‌లో పాన్ కార్డు దరఖాస్తు అప్లికేషన్లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఫార్మట్ స్థానంలో కొత్త ఫారాలను తీసుకురానున్నారు. దీంతో పాన్ అప్లికేషన్లను ఇక స్వీకరించరు. పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాన్నా లేదా వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నా కొత్త అప్లికేషన్లు రానున్నాయి.

ఈ-పాన్ పేరుతో మోసాలు

ఈ-పాన్ డౌన్ లోడ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. సెకన్లలోనే ఈ-పాడ్ డౌన్ లోడ్ చేసుకోండి అంటూ సైబర్ నేరగాళ్లు స్పామ్ లింకులు పంపుతున్నారు.  ఆ లింక్‌లు క్లిక్ చేస్తే ఫోన్లలోకి మాల్‌వేర్ చొరబడి వ్యక్తిగత వివరాలు సేకరిస్తుంది. ఆ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్, ఇతర వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో ఇలాంటి లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అలాంటి లింకులు కనిపిస్తే అసలు క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. ఐటీ డిపార్ట్‌మెంట్ అలాంటి మెస్సేజ్‌లు అసలు పంపదని సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటి లింక్‌లు కనిపిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Follow Us