
యూపీఐ రాకతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో వేగం పెరిగింది. టీ షాప్, కిరాణా షాపుల వద్ద చిన్న మొత్తాల నుంచి పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ద్వారా సెకన్లలోనే పూర్తి చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే క్షణాల్లోనే పేమెంట్ పూర్తవుతుంది. అయితే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించనున్నారనే వార్తల క్రమంలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి దుకాణదారుల వరకు ప్రతిఒక్కరిలో కలవరం మొదలైంది. ఆ భారాన్ని తాము మోయాల్సి వస్తుందేమోనని అందరూ భయపడుతున్నారు. దీంతో యూపీఐ వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి వినియోగదారుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయరని NPCI ప్రకటించింది. భవిష్యత్తులో కూడా వినియోగదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు విధించబోమని స్పష్టం చేసింది. చిన్న దుకాణాదారులు, వ్యాపారుల నుండి కూడా ఎటువంటి MDR ఛార్జీలు వసూలు చేయమని తెలిపింది. కస్టమర్ల నుంచి UPI చెల్లింపులను స్వీకరించడానికి చిన్న వ్యాపారులు ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అతి చిన్న దుకాణదారులకు కూడా డిజిటల్ చెల్లింపు సౌకర్యాలను అందించడమే UPI లక్ష్యమని పేర్కొంది. UPI ఇప్పుడు కేవలం ఒక చెల్లింపు ప్లాట్ఫారమ్ మాత్రమే కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థగా మారిందని పేర్కొంది.
అయితే ప్రతి నెలా బిలియన్ల కొద్దీ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో యూపీఐ వ్యవస్థను నిర్వహించేందుకు, మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు చాలా ఖర్చు అవుతుంది. దీంతో పెద్ద వ్యాపారులకు UPI చెల్లింపులపై ఛార్జీలు విధించడం ద్వారా వచ్చిన సొమ్మును యూపీఐ వ్యవస్థ బలోపేతానికి ఖర్చు పెట్టనున్నారు. యూపీఐ వంటి జాతీయ చెల్లింపుల వ్యవస్థను నడపడానికి నిరంతర ఖర్చులు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఖర్చులను ప్రధానంగా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు భరిస్తున్నారు.