
హోలీకి ముందు గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. వాణిజ్య సిలిండర్ ధరలను ఇండియన్ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.28 నుంచి రూ.31 వరకు పెరగ్గా.. డొమెస్టిక్ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్ధిరంగా ఉంచాయి. ప్రతీ నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ కొత్త ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. అందులో భాగంగా మార్చి 1న గ్యాస్ సిలిండర్ ధరల్లో కంపెనీలు మార్పులు చేశాయి. తాజా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వాటి ధరలను యథాతధంగా ఉంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.905.00 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, గుంటూరులో రూ.877.50గా ఉంది. ఇక విశాఖపట్నంలో రూ.861.00గా ఉండగా.. వరంగల్లో రూ.924.00గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.853, కోల్ కత్తాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50 వద్ద ఉన్నాయి. రవాణా, నిర్వహణ ఛార్జీల కారణంగా ప్రాంతాలను బట్టి గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. చివరిసారిగా గత ఏడాది ఏప్రిల్ 8న వీటి ధరలను సవరించగా.. అప్పటినుంచి ఎలాంటి మార్పు లేదు
రెస్టారెంట్లు, హోటల్స్, ధాబాలు ఇతర వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో 19 కిలోల సిలిండర్ ధరలు రూ.48 నుంచి రూ.50 వరకు పెరగ్గా… మార్చి 1న మళ్లీ పెంచాయి. ప్రాంతాలను బట్టి రూ.28 నుంచి రూ.31 వరకు ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ ప్రకారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
-ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1768.50గా ఉంది. గతంలో రూ.1740.50గా ఉండేది
-కోల్కత్తాలో రూ.1844.50గా ఉండగా.. ఇప్పుడు రూ.1875.50కి పెరిగింది
-ముంబైలో గతంలో రూ.1692గా ఉండగా.. ఇప్పుడు రూ.1720.50కి చేరుకుంది
-చెన్నైలో గతంలో రూ.1899.50గా ధర ఉండగా.. ఇప్పుడు రూ.1929కి పెరిగింది
వాణిజ్య సిలిండర్ ధరలను గత మూడు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెంచుతూ వస్తోన్నాయి. జనవరిలో రూ.111 పెరగ్గా.. ఫిబ్రవరిలో రూ.49 పెరిగింది. మార్చిలో కూడా మళ్లీ పెరిగింది. అంతకముందు డిసెంబర్లో స్వల్పంగా ధర తగ్గింది