
దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. CBDT (సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి (ఆర్థిక సంవత్సరం 2025-26) సంబంధించిన ITR ఫారాలను నోటిఫై చేసింది. ముఖ్యంగా చిన్న, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ITR-1, ITR-2 ఫారాల్లో పారదర్శకత పెంచడం, ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా పలు మార్పులు తీసుకువచ్చారు.
డెలాయిట్ ఇండియా భాగస్వామి సుమిత్ సింఘానియా ప్రకారం.. ఫారాల నిర్మాణం లేదా సంఖ్యలో పెద్ద మార్పులు లేవు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఇప్పటి వరకు ఉన్న వెల్లడింపు విధానాలకే అనుసంధానం కొనసాగుతోంది. అసెస్మెంట్ ఇయర్ ప్రస్తావనతో సహా పాత విధానాలే అమల్లో ఉంటాయి. ఈసారి ముఖ్యంగా సెక్షన్ 80G, సెక్షన్ 80GGC కింద విరాళాల వెల్లడిలో మార్పులు చేశారు. ఇకపై రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చిన వారు ఆ పార్టీ పేరు మాత్రమే కాకుండా, వారి PAN వివరాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.
అదనంగా విరాళం ఇచ్చిన తేదీ, మొత్తం, చెల్లింపు విధానం (నగదు, చెక్, UPI, NEFT, RTGS) వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. అలాగే లావాదేవీ రిఫరెన్స్ నంబర్, బ్యాంక్ IFSC కోడ్ వంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్టే టాక్స్ అడ్వైజర్స్ భాగస్వామి కుల్దీప్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు పారదర్శకతను పెంచడమే కాకుండా, గతంలో జరిగిన మోసపూరిత క్లెయిమ్లను అరికట్టడంలో సహాయపడతాయి.
సాధారణంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై 31లోపు తమ ITRలను దాఖలు చేయాలి. ఈసారి కొత్త వివరాల కారణంగా ఫారాలు నింపేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా కొత్త ITR ఫారాలు పన్ను వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి