
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రధాన నగారాల్లో మెట్రో సౌకర్యం అందుబాటులో ఉంది. జనాభా ఎక్కువగా నివసించే సిటీలలో మెట్రో సేవలను ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ద్వారా లక్షలాది మంది ప్రజలు తరచూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే మెట్రోలలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి రూల్స్ అమల్లో ఉంటాయి..? రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జరిమానాలు ఎలా ఉంటాయి? అనే విషయాలపై చాలామందికి అవగామన ఉండదు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్రోలో ప్రయాణించేటప్పుడు అందరి భద్రత, పరిశుభ్రత కారణంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తారు. కొన్ని నేరాలకు జైలుశిక్ష కూడా పడొచ్చు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు చెల్లుబాటు అయ్యే టికెట్ ఉండాలి. టికెట్ లేకుండా ప్రయాణించడం లేదా ఒకరి టికెట్ను ఇతరులు ఉపయోగించడం నేరం. దీనికి అధికారులు జరిమానా విధిస్తారు. ఇక మెట్రోలలో లగేజీపై కూడా పరిమితులు ఉన్నాయి. 25 కేజీల లోపు బరువు ఉన్న సామాన్లను మాత్రమే అనుమతి ఉంది. ఇక నిషేధిత వస్తువులైన పేలుడు పదార్థాలు, పెట్రోల్, కిరోసిన్, తుపాకులు, కత్తులు వంటి ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.
మెట్రో స్టేషన్లలో లేదా ట్రైన్ లోపల సిగరేట్, మద్యం త్రాగడం వంటివి నిషేధం. ఇలాంటి చర్యలకు పాల్పడితే మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దీంతో పోలీసులు మీపై కేసు నమోదు చేస్తారు. ఇక తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగేలా ప్రవర్తించడం, పెద్దగా అరవడం లాంటివి నిషేధం. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటారు. తాజాగా నాగోల్-రాయదుర్గం వెళ్లే మెట్రోలో ఒక యువకుడు మెట్రో కోచ్ కిటికీ గ్లాస్ స్క్రీన్పై కాళ్లు పెట్టాడు. సీట్లో కూర్చోని కాళ్లను గ్లాస్ స్క్రీన్పై పెట్టాడు. దీంతో అధికారులు రూ.250 జరిమానా విధించారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రోలలో నిబంధనలు ఉల్లంఘిస్తే స్థానిక రాష్ట్రాల చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయి.