
మే 1వ తేదీకి జీతం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈసారి చిన్న నిరాశ కలగొచ్చు. కారణం అదే రోజు కార్మిక దినోత్సవం, బుద్ధ పౌర్ణమి రావడం. ఈ రెండు సందర్భాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. అందువల్ల జీతాల జమలో ఆలస్యం జరగడం సహజం. మే 1న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పనిచేయకపోవడంతో, జీతాల ప్రాసెసింగ్, క్లియరింగ్ వంటి ప్రక్రియలు నిలిచిపోతాయి. ముఖ్యంగా NEFT, RTGS వంటి వ్యవస్థలు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల జీతం నేరుగా ఖాతాలో జమ కావడం ఆలస్యమవుతుంది. కొన్ని డిజిటల్ సేవలు కొనసాగినా, కంపెనీలు సాధారణంగా జీతాలను పనిదినాల్లోనే ప్రాసెస్ చేస్తాయి.
దీంతో మే 1న జీతం రావాల్సిన ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు మే 2న లేదా ఆ తర్వాతి పనిదినంలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా కంపెనీ జీతాలను ఎప్పుడు విడుదల చేసిందన్నది, బ్యాంకుల క్లియరింగ్ సమయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే జీతాలను విడుదల చేస్తాయి. అయితే చాలా కంపెనీలు నిర్దిష్ట షెడ్యూల్ను అనుసరించడంతో, ఒకటి లేదా రెండు రోజుల ఆలస్యం సాధారణంగా కనిపిస్తుంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అయిన UPI, మొబైల్ బ్యాంకింగ్ 24 గంటలూ అందుబాటులో ఉన్నప్పటికీ, జీతాల జమ సాధారణంగా బ్యాచ్ ప్రాసెసింగ్ ద్వారా జరుగుతుంది. అందువల్ల సెలవు దినాల్లో ఇవి ప్రభావితమవుతాయి.
ఉద్యోగులు ఈ పరిస్థితిలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆలస్యం తాత్కాలికమే. సాధారణంగా తదుపరి పనిదినంలోనే జీతం జమ అవుతుంది. ఇక మే నెలలో బ్యాంకులకు గణనీయమైన సెలవులు ఉన్నాయి. ఆదివారాలు (3, 10, 17, 24, 31), రెండవ, నాల్గవ శనివారాలు (9, 23)తో పాటు పలు ప్రాంతీయ పండుగల సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అందులో రబీంద్రనాథ్ టాగోర్ జయంతి, రాష్ట్ర దినోత్సవాలు, ఈద్ అల్-అధా వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి