గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్

దేశంలో ఎల్‌పీజీ సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్రం రూ.7 వేల కోట్లతో 1,800 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలోని చర్లపల్లి నుంచి నాగ్‌పూర్‌ వరకు 556 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుతో అనుసంధానం కానున్నాయి.

గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్
Lpg Pipeline

Updated on: Aug 22, 2026 | 6:31 PM

దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్‌ సరఫరాలో మౌలిక వసతులను విస్తరించే దిశగా సుమారు రూ.7 వేల కోట్ల వ్యయంతో 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈ ప్రాజెక్టుకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) ఆమోదం తెలిపినట్లు సమాచారం.

తెలంగాణకు కీలక అనుసంధానం

ఈ భారీ ప్రాజెక్టులో తెలంగాణకు కూడా చోటు దక్కింది. రాష్ట్రంలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వరకు 556 కిలోమీటర్ల పొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. ఈ మార్గం ద్వారా తెలంగాణకు వంటగ్యాస్ సరఫరా మౌలిక వసతులు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఈ పైప్‌లైన్‌ నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ రంగానికి చెందిన GAIL చేపట్టనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎల్‌పీజీని వేగంగా, సురక్షితంగా తరలించేందుకు పైప్‌లైన్ వ్యవస్థ కీలకంగా మారనుంది.

ఐదు రాష్ట్రాల మీదుగా పైప్‌లైన్లు

కొత్తగా ఏర్పాటు చేయనున్న నెట్‌వర్క్‌ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలను అనుసంధానించనుంది. ఇందులో మూడు ప్రధాన పైప్‌లైన్‌ మార్గాలను ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌ వరకు 611 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. అలాగే మహారాష్ట్రలోని షిక్రాపూర్‌ నుంచి గోవా, కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు చర్లపల్లి–నాగ్‌పూర్‌ మార్గం తెలంగాణను జాతీయ ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌తో మరింత బలంగా అనుసంధానించనుంది.

7,700 నుంచి 9,500 కిలోమీటర్లకు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ సుమారు 7,700 కిలోమీటర్లు ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ నెట్‌వర్క్‌ దాదాపు 9,500 కిలోమీటర్లకు విస్తరించనుంది. పైప్‌లైన్‌ ద్వారా ఎల్‌పీజీ రవాణా పెరగడం వల్ల రోడ్డు, రైలు మార్గాలపై ఆధారపడటం కొంత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో దేశంలోని వినియోగ కేంద్రాలకు ఎల్‌పీజీని నిరంతరాయంగా తరలించేందుకు ఈ నెట్‌వర్క్‌ ఉపయోగపడనుంది.

సరఫరా వ్యవస్థకు మరింత బలం

దేశంలో ఎల్‌పీజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నిల్వ కేంద్రాలు, బాట్లింగ్‌ ప్లాంట్లు, రవాణా వ్యవస్థల మధ్య సమర్థవంతమైన అనుసంధానం అవసరం. ఈ నేపథ్యంలో కొత్త పైప్‌లైన్‌ ప్రాజెక్టులు సరఫరా వ్యవస్థకు మరింత స్థిరత్వాన్ని తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సహా దక్షిణ, పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాల మధ్య ఎల్‌పీజీ రవాణా సామర్థ్యం పెరగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us