
దేశంలో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ దుకాణాలు అన్నీ గ్యాస్ దొరక్క మూతపడుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో గ్యాస్ కొరత మరింత ముదిరే అవకాశముందనే భయంతో ప్రజలు ఇప్పటినుంచే ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక గ్యాస్ లేకపోవడంతో ఫుడ్ స్టాల్స్ కూడా ఇండక్షన్ స్టవ్ను ఉపయోగిస్తున్నాయి. దీంతో ఇటీవల ఇండక్షన్ సేల్స్ దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో గ్యాస్ కంపెనీలు ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం, రవాణాలో అంతరాయం కారణంతో దేశంలో గ్యాస్ కొరత సమస్య ఏర్పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ల నుంచి పైప్డ్ గ్యాస్ అయిన పీఎన్జీకి ప్రజలు మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ప్రజలు మారేలా చేసేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. గ్యాస్ పైప్లైన్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు ఆఫర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఇంద్రప్రస్ధ గ్యాస్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు పీఎన్జీ కనెక్షన్లు తీసుకుంటే రూ.500 విలువైన ఉచిత గ్యాస్ అందిస్తామంటూ ప్రకటించింది. ఇక మహానగర్ గ్యాస్ లిమిటెడ్, గెయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఇలాంటి ఆఫర్లను ప్రకటించాయి.
ఇక గ్యాస్ కొరత క్రమంలో కేంద్రం ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎన్జీ వాడుతున్నవారు గ్యాస్ సిలిండర్లు ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఎన్జీ గ్యాస్ వాడుతూ ప్రత్యామ్నాయంగా గ్యాస్ సిలిండర్లు వాడుతుంటే.. వాటిని సరెండర్ చేయాలని తెలిపింది. అలాంటివారి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను రద్దు చేయాలని గ్యాస్ సరఫరా కంపెనీలకు ఆదేశాలిచ్చింది. మార్చి 14వ తేదీన పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉండటానికి వీల్లేదని తెలిపింది. కాగా దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్రం చెబుతోంది. త్వరలో వాణిజ్య సిలిండర్ల సరఫరా కూడా మొదలవుతుందని స్పష్టం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో వాణిజ్య సిలిండర్లను డెలివరీ చేస్తామని స్పష్టం చేసింది. గ్యాస్ గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అందుబాటులోనే ఉందని పేర్కొంది.