
దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఏప్రిల్ 10 నుంచి టోల్ బూత్ల వద్ద నగదు స్వీకరణ పూర్తిగా నిలిపివేయబడుతుంది. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా FASTag లేదా UPI ద్వారా మాత్రమే టోల్ చెల్లించాలి. ఈ నిర్ణయంతో టోల్ బూత్ల వద్ద రద్దీ తగ్గడం, ట్రాఫిక్ వేగం పెరగడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. అదనంగా ఫీజు మినహాయింపుల కోసం ఐడీ కార్డులు చూపించే పద్ధతిని కూడా తొలగించనున్నారు. అర్హులైన వాహనదారులకు మినహాయింపు ఫాస్టాగ్లు జారీ చేసే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత విభాగాలతో చర్చలు జరిపింది.
కొత్త విధానంలో భాగంగా వాహనదారులు రూ.3,075 చెల్లించి వార్షిక ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఈ పాస్తో సంవత్సరానికి 200 టోల్ ప్లాజాలను దాటే అవకాశం ఉంటుంది. హైవేలోకి ప్రవేశించే ముందు యాక్టివ్ ఫాస్టాగ్ లేదా యూపీఐ సదుపాయం సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఫాస్టాగ్ లేని వాహనాలు యూపీఐ ద్వారా టోల్ చెల్లించవచ్చు. అయితే యూపీఐ ద్వారా చెల్లించే వారికి సాధారణ టోల్ ఛార్జీల కంటే 1.25 రెట్లు అధిక రుసుము వసూలు చేయబడుతుంది. ఒకవేళ డ్రైవర్ చెల్లింపును నిరాకరిస్తే, సంబంధిత నిబంధనల ప్రకారం వాహనాన్ని హైవేలోకి అనుమతించరు. అవసరమైతే ఈ-నోటీసులు పంపించి, రెట్టింపు టోల్ రుసుము కూడా వసూలు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మల్టీ-లేన్ ఫ్రీ-ఫ్లో టోలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ విధానంలో వాహనాలు టోల్ బూత్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. కెమెరాలు, RFID రీడర్లు వాహనాన్ని గుర్తించి ఆటోమేటిక్గా టోల్ కట్ చేస్తాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు తరువాత ఈ-నోటీసులు జారీ చేయబడతాయి. మొత్తం మీద డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ, టోల్ వ్యవస్థను వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి