
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ యుద్ధ మేఘాల ప్రభావం భారత్పై నేరుగా పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశీయంగా ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇండియా టుడే టీవీ నివేదికల ప్రకారం.. మే 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం గనుక చమురు కంపెనీల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ధరల పెరుగుదల భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.4 నుంచి రూ 5 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర రూ.40 నుంచి రూ.50 వరకు భారం పడవచ్చు.
2022 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు 70 డాలర్ల నుండి ఏకంగా 126 డాలర్లకు పెరగడం చమురు మార్కెటింగ్ కంపెనీలను సంక్షోభంలోకి నెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీలు నెలకు సుమారు రూ.30,000 కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధరల పెంపు తప్పనిసరి అని కంపెనీలు వాదిస్తున్నాయి.
ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఇంధన రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనివల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, ధరలు నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడటంతో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.
ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారిగా రూ. 993 పెరగడంతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,000 మార్కును దాటేసింది. ఇప్పుడు అదే బాటలో ఇంటి వినియోగ సిలిండర్ల ధరలు కూడా పెరిగితే సామాన్యుడి వంటింటి బడ్జెట్ తలకిందులు కావడం ఖాయం.