Success Story: రోజుకు రూ.10 కూలీ.. నేడు రూ.681 కోట్ల బిజినెస్! క్లాస్‌ 6లోనే చదువు మానేసిన వ్యక్తి సక్సెస్‌ స్టోరీ

Success Story: పేదరికం, చదువు మధ్యలో ఆగిపోవడం, కూలీ పని.. ఇవేవీ తన విజయానికి అడ్డంకులు కాకుండా ముస్తఫా ముందుకు సాగారు. సరైన సమయంలో ఒక టీచర్‌ ఇచ్చిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్నారు. విద్యను పూర్తిచేసి, ఉద్యోగంలో అనుభవం సంపాదించి, చివరకు తన ఆలోచనను వ్యాపారంగా..

Success Story: రోజుకు రూ.10 కూలీ.. నేడు రూ.681 కోట్ల బిజినెస్! క్లాస్‌ 6లోనే చదువు మానేసిన వ్యక్తి సక్సెస్‌ స్టోరీ
Success Story

Updated on: Aug 28, 2026 | 10:19 AM

Success Story: కష్టాలు వచ్చినప్పుడు చాలామంది తమ కలలను వదులుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆ కష్టాలనే తమ విజయానికి మెట్లుగా మార్చుకుంటారు. అలాంటి వారిలో పి.సి. ముస్తఫా ఒకరు. ఒకప్పుడు తండ్రితో కలిసి కూలీ పనికి వెళ్లి రోజుకు కేవలం రూ.10 సంపాదించిన ఆయన.. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఇంజినీరింగ్, ఐఐఎం వరకు వెళ్లారు. చివరకు సొంత వ్యాపారాన్ని ప్రారంభించి వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించారు.

ఇది కూడా చదవండి: Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా క్లోజ్ చేస్తున్నారా? తొందరపడి ఈ పొరపాటు అస్సలు చేయకండి!

పేద కుటుంబంలో జననం

కేరళలోని వయనాడ్‌ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో ముస్తఫా పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కూలీగా పనిచేసేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో చిన్న వయసులోనే తండ్రికి పనిలో సహాయం చేయాల్సి వచ్చింది. చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతిలోనే చదువు మానేసి తండ్రితో కలిసి కూలీ పనికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు రోజుకు కేవలం రూ.10 మాత్రమే వచ్చేది.

ఓ టీచర్‌ జీవితాన్ని మార్చారు

ముస్తఫాలోని ప్రతిభను ఓ ఉపాధ్యాయుడు గుర్తించారు. చదువును మధ్యలో ఆపేయకుండా మళ్లీ పాఠశాలకు వెళ్లాలని ప్రోత్సహించారు. ఆ సలహా ఆయన జీవితాన్నే మార్చేసింది. మళ్లీ చదువును ప్రారంభించిన ముస్తఫా.. క్రమంగా మంచి ప్రతిభ కనబరిచారు. తర్వాత NIT కాలికట్‌లో ఇంజినీరింగ్‌ చదివారు. అనంతరం IIM బెంగళూరులో విద్యను అభ్యసించారు.

విదేశీ ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి..

చదువు పూర్తయిన తర్వాత ముస్తఫా మంచి కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరారు. అయితే ఉద్యోగంతోనే సంతృప్తి చెందలేదు. స్వదేశానికి తిరిగి వచ్చి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 2005లో తన నలుగురు బంధువులతో కలిసి iD Fresh Food సంస్థను ప్రారంభించారు. మొదట బెంగళూరులో చిన్న స్థాయిలో ఇడ్లీ, దోస పిండిని తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు.

చిన్న వంటగది నుంచి భారీ బ్రాండ్‌ వరకు

ఇడ్లీ, దోస పిండిని తయారు చేసే వ్యాపారం మొదట చాలా చిన్న స్థాయిలోనే సాగింది. అయితే నాణ్యత, పరిశుభ్రత, తాజాదనంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంట్లో తయారు చేసుకునే రుచిని ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ రూపంలో అందించడంపై దృష్టి పెట్టడంతో కస్టమర్ల ఆదరణ పెరిగింది. అలా క్రమంగా iD Fresh Food విస్తరించింది. ఇడ్లీ-దోస పిండితో పాటు పరోటా, చపాతీ, వడ పిండి, పనీర్‌, పెరుగు, ఇతర రెడీ-టు-కుక్‌ ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

రూ.681 కోట్లకు చేరిన వ్యాపారం

ఒకప్పుడు రోజుకు రూ.10 సంపాదించిన ముస్తఫా.. ఇప్పుడు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం iD Fresh Food FY2025లో రూ.681.38 కోట్ల ఆదాయం నమోదు చేసింది. సంస్థ భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఇదే సమయంలో సంస్థ విలువ కూడా వేల కోట్ల రూపాయల స్థాయికి చేరినట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి.

ముస్తఫా కథ చెప్పే పాఠం ఇదే..

పేదరికం, చదువు మధ్యలో ఆగిపోవడం, కూలీ పని.. ఇవేవీ తన విజయానికి అడ్డంకులు కాకుండా ముస్తఫా ముందుకు సాగారు. సరైన సమయంలో ఒక టీచర్‌ ఇచ్చిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్నారు. విద్యను పూర్తిచేసి, ఉద్యోగంలో అనుభవం సంపాదించి, చివరకు తన ఆలోచనను వ్యాపారంగా మార్చారు. రోజుకు రూ.10 కూలీ నుంచి రూ.681 కోట్ల వ్యాపారం వరకు ఆయన ప్రయాణం.. పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదల, సరైన ఆలోచన, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే విజయం సాధించవచ్చని నిరూపిస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us