ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీలతో పాటు యూపీఐ లావాదేవీలు పెరగడంలో బ్యాంకు ఖాతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే గతంలో మన సొమ్మును బందిపోటు దొంగలు దోచుకున్న చందాన ఇప్పుడు బ్యాంకు అకౌంట్లోని సొమ్మును తస్కరించేందుకు సైబర్ మోసగాళ్లు తయారయ్యారు. తాజాగా ఈ తరహా మోసం గురించి ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కస్టమర్లు ఎక్స్టార్షన్ స్కామ్లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మన ఫొటోలు లేదా వీడియోలు మార్ఫ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరిస్తుంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి హెచ్చరికలు చేసిందో ఓ సారి తెలుసుకుందాం.
ఎక్స్టార్షన్ స్కామ్లు చేసే వారు ముందుగానే వినియోగదారుల ప్రైవేట్ ఫోటోలు లేదా గ్రహీతకు సంబంధించిన వ్యక్తిగత డేటా వంటి సమాచారం తమ వద్ద ఉందని మెయిల్ చేస్తారు. ఒకవేళ వినియోగదారుడు తమ మెయిల్స్ను లెక్కచేయకపోతే ఫొటోలను మార్ఫ్ చేసి కుటుంబ సభ్యులకు పంపుతామని హెచ్చరిస్తారు. ముఖ్యంగా వినియోగదారులను భయపెట్టి డబ్బు గుంజాలనే ప్రయత్నంలోనే ఉంటారని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు తన ఈ-మెయిల్లో స్కామ్ను గుర్తించడంలో సహాయపడే కొన్ని హెచ్చరిక సంకేతాలను హైలైట్ చేస్తుంది. ఇవి ప్రభుత్వ శాఖ, రుణ సేకరణ ఏజెన్సీ లేదా విశ్వసనీయ సంస్థ నుంచి వచ్చినట్లు నమ్మిస్తారు. కాల్ చేసిన వ్యక్తి మీకు డబ్బు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేదా అరెస్టు చేస్తామని బెదిరిస్తాడు. ముఖ్యంగా కొంత మంది జరిమానా కట్టాలనే నెపంతో డబ్బును దోచుకుంటారని ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. ముఖ్యంగా స్కామర్లు మీ పాస్పోర్ట్ వివరాలు, పుట్టిన తేదీ లేదా బ్యాంక్ సమాచారం వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా అడగే అవకాశం ఉంది. జరిమానా చెల్లించకుంటే పోలీసులు మీ ఇంటి వద్దకు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తారని కాల్ చేసిన వ్యక్తి బెదిరిస్తాడి పేర్కొంది. అందువల్ల కస్టమర్లు ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..