
దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రత, వేగాన్ని మరింత మెరుగుపరచేందుకు ICICI బ్యాంక్ కీలక అడుగు వేసింది. తన మొబైల్ బ్యాంకింగ్ యాప్ iMobile ద్వారా యూపీఐ లావాదేవీల కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త సౌకర్యంతో వినియోగదారులు ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర ద్వారా సులభంగా చెల్లింపులను ఆమోదించవచ్చు. కొత్త విధానంలో రూ.5,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలకు ఇకపై పిన్ నమోదు అవసరం ఉండదు. వినియోగదారులు బయోమెట్రిక్ ధృవీకరణతోనే చెల్లింపులను పూర్తి చేయవచ్చు. దీంతో వేగవంతమైన ట్రాన్సాక్షన్లు సాధ్యమవుతాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పిన్ ఎంటర్ చేసే సమయంలో ఇతరులు గమనించే ప్రమాదం తగ్గి, భద్రత మరింత బలోపేతం అవుతుంది.
అయితే రూ.5,000కు మించిన లావాదేవీలకు మాత్రం ప్రస్తుత యూపీఐ పిన్ను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ద్వంద్వ విధానం ద్వారా సౌకర్యం, భద్రత మధ్య సమతుల్యతను సాధించాలనే లక్ష్యంతో ఈ ఫీచర్ను రూపొందించినట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ (v30), iOS (v28.2)లో తాజా వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫింగర్ప్రింట్ ద్వారా, iOS వినియోగదారులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా చెల్లింపులను ఆమోదించగలరు.
బయోమెట్రిక్ ఫీచర్ను యాక్టివేట్ చేయడం కూడా సులభమే. వినియోగదారులు యాప్లో లాగిన్ అయి, UPI సెట్టింగ్లలోకి వెళ్లి, సంబంధిత ఖాతాను ఎంపిక చేసి బయోమెట్రిక్ ఆప్షన్ను ప్రారంభించాలి. ధృవీకరణ కోసం ఒకసారి UPI పిన్ నమోదు చేసిన తర్వాత, పరికరంలోని బయోమెట్రిక్ డేటాను నిర్ధారించాలి. డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న ఈ సమయంలో ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు మరింత సురక్షితమైన, సులభమైన అనుభవాన్ని అందిస్తుందని బ్యాంక్ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి