
భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు; అది సంప్రదాయం, సంస్కృతి, అత్యవసర కాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. అయితే, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాఠీ వెల్త్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.
భారతదేశం తన అవసరాలకు మించి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల దేశ కరెంట్ ఖాతా లోటు పెరుగుతోంది. కొన్ని ఏళ్ల క్రితం వరకు వార్షికంగా 35 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతుల బిల్లు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కంటే, బంగారం దిగుమతుల కోసమే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. ఉదాహరణకు, 2025-26లో FIIల అమ్మకాలు రూ.1.68 లక్షల కోట్లుగా ఉంటే, బంగారం దిగుమతుల బిల్లు అంతకంటే కొన్ని రెట్లు అధికంగా ఉంది. ఇది రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణంగా మారుతోంది.
భారతీయు ఇళ్లలో సుమారు 4 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం లాకర్లలో నిద్రాణంగా ఉందని అంచనా. ప్రజలు తమ వద్ద ఉన్న మొత్తం బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం విక్రయించినా, దేశ దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుంది. తమ కంపెనీ అయిన ఆనంద్ రాఠీ వెల్త్ను ఉదాహరణగా చూపుతూ, తమ సంస్థలో ఉన్న 13,800 కుటుంబాలలో ప్రతి ఒక్కరు కేవలం 100 గ్రాముల బంగారాన్ని విక్రయిస్తే, దాదాపు రూ. 2,500 నుండి రూ. 3,000 కోట్ల విలువైన బంగారం మార్కెట్లోకి వస్తుంది. దీనివల్ల కొత్తగా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది, తద్వారా రూపాయి బలోపేతం అవుతుందని ఆనంద్ రాఠీ వెల్త్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ స్పష్టం చేశారు.
బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిల వద్ద ఉన్నాయని, లాభాలను స్వీకరించడానికి ఇది సరైన సమయమని అజీజ్ సూచించారు. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పెరిగినప్పుడు ఎలాగైతే లాభాలను వెనక్కి తీసుకుంటామో, బంగారం విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరించాలని ఆయన కోరారు. “బంగారం అమ్మడం అంటే అది దేశం కోసం చేసే త్యాగం కాదు, అది ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం. దీనివల్ల వ్యక్తిగతంగా లాభం చేకూరడమే కాకుండా, దేశ ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.” అని ఫిరోజ్ అజీజ్ అన్నారు.
ప్రజలు తమ పాత బంగారాన్ని విక్రయించడానికి ప్రోత్సాహకంగా, ప్రభుత్వం మూలధన లాభాల పన్ను నుండి తాత్కాలికంగా ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పన్ను భారం లేకపోతే సామాన్యులు తమ వద్ద ఉన్న నిరుపయోగ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి సుముఖత చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడు తమ ఆర్థిక ప్రణాళికలో భాగంగా కొద్దిపాటి బంగారాన్ని విక్రయించడం ద్వారా అటు వ్యక్తిగత లాభాన్ని, ఇటు దేశ ఆర్థిక సుస్థిరతను సాధించవచ్చని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..