
సాధారణంగా గ్రాట్యుటీ అనేది మీ చివరి ప్రాథమిక జీతం, కరువు భత్యం (DA) ఆధారంగా లెక్కించబడుతుంది. దీని గరిష్ట పరిమితి ప్రస్తుతం రూ. 20 లక్షలుగా ఉంది. కానీ, సంస్థ నుండి గౌరవప్రదంగా నిష్క్రమించినప్పుడు మాత్రమే ఈ డబ్బు అందుతుంది. ఒకవేళ మీరు సంస్థకు ఆర్థిక నష్టం కలిగించినా, లేదా తోటి ఉద్యోగులతో హింసాత్మకంగా ప్రవర్తించినా కంపెనీ మీ గ్రాట్యుటీని నిలిపివేసే హక్కును కలిగి ఉంటుంది. అసలు ఏ ఏ సందర్భాల్లో మీ గ్రాట్యుటీ రద్దవుతుంది? నిబంధనలు ఏం చెబుతున్నాయి? వంటి అంశాలను ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం..
1. 5 సంవత్సరాల నిబంధన:
గ్రాట్యుటీ పొందాలంటే ఒకే కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు నిరంతరం పనిచేసి ఉండాలి. అయితే, ఉద్యోగి మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా ఈ 5 ఏళ్ల నిబంధన వర్తించదు.
2. గ్రాట్యుటీ ఎప్పుడు రద్దవుతుంది?
ఆస్తి నష్టం: ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యం వల్ల కంపెనీ ఆస్తికి ఆర్థిక నష్టం కలిగిస్తే, ఆ నష్టాన్ని గ్రాట్యుటీ నుండి మినహాయించుకునే అధికారం కంపెనీకి ఉంటుంది.
దుష్ప్రవర్తన: కార్యాలయంలో సహోద్యోగులపై లేదా పై అధికారులపై భౌతిక దాడులకు పాల్పడినా, తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘనలు చేసినా గ్రాట్యుటీ నిలిపివేస్తారు.
క్రిమినల్ కేసులు: ఆఫీసులో దొంగతనం, మోసం లేదా ఏదైనా తీవ్రమైన నేరానికి పాల్పడి ఆ కారణంతో ఉద్యోగం నుండి తొలగించబడితే ఒక్క పైసా కూడా లభించదు.
3. కంపెనీ ఎప్పుడు డబ్బును ఆపలేరు?
మీరు చట్టబద్ధంగా రాజీనామా చేసినా లేదా రిటైర్ అయినా కంపెనీ మీ గ్రాట్యుటీని నిలిపివేయకూడదు. కేవలం దర్యాప్తు పేరుతో అనవసరంగా కాలయాపన చేయడం చట్టవిరుద్ధం. మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో పని చేస్తే మీ గ్రాట్యుటీకి ఎటువంటి ఢోకా ఉండదు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. గ్రాట్యుటీకి సంబంధించిన వివాదాలు తలెత్తితే కార్మిక శాఖ లేదా న్యాయ నిపుణులను సంప్రదించడం ఉత్తమం.