
ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రకం పెట్రోల్ వాహనాల్లో ఉపయోగించడం వల్ల వెహికల్ మైలేస్ తగ్గుతుందనే వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం పదే పదే వార్తలను ఖండిస్తూ వస్తోండగా.. తాజాగా అంగీకరించింది. ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనం మైలేజ్ తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వెహికల్ మైలేజీ 3 నుంచి 5 శాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గుతున్నప్పటికీ.. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. పర్యావరణానికి మేలు చేకూరడమే కాకుండా కాలుష్యం భారీగా తగ్గుతుందని పేర్కొంది.
ఈ20 పెట్రోల్ వాడటం వల్ల వెహిలక్ ఇంజిన్ పనితీరు మెరుగుపడటమే కాకుండా పికప్ పెరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ20 పెట్రోల్ ప్రవేశపెట్టడంపై తాము ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని, అన్ని పరీక్షలు, పరిశోధనల తర్వాతే ప్రారంభించినట్లు తెలిపింది. 2001 నుంచే దీనిపై పరిశోధనలు, పరీక్షలు జరుగుతున్నాయని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. బయోఫ్యూయల్ విధానం వల్ల దేశంలో ఇంధన భద్రత పెరుగుతుందని, ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుందని పేర్కొంది. ఈ20 ఇంధనానికి అధిక ఆక్టేన్ రేటింగ్ ఉందని, మిశ్రమం లేని ఇంధనంతో పోలిస్తే ఇది వాహన. ఉద్గార సంబంధితంగా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుందంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు సుమారు 70 డాలర్లకు పడిపోయినప్పుడు.. స్వచ్ఛమైన పెట్రోల్తో పోలిస్తే E20 ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ఖరీదు అవుతుందంది.
“మైలేజ్ అనేది ఒక కొలమానం మాత్రమే. E20 పెట్రోల్ వల్ల గణనీయంగా అధిక ఆక్టేన్ రేటింగ్, ఉన్నతమైన యాంటీ నాక్ లక్షణాలు, వేగవంతమైన దహనం, మెరుగైన పికప్, సున్నితమైన త్వరణం, స్వచ్ఛమైన ఇంజిన్ పనితీరు లభిస్తుంది. ఇది అతి తక్కువ కణ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అలాగే దాని జీవితకాల కార్బన్ ఉద్గారాలను సుమారు 4 శాతం వరకు గణనీయంగా తగ్గిస్తుంది. ఇక దేశంలోని రైతులకు న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం లాభదాయకమైన ధరలకు ఇథనాల్ను కొనుగోలు చేస్తున్నాం. భారతదేశంలో అమ్ముడయ్యే ఇంధనంలో 20% ఇథనాల్ కావడం అనేది వాస్తవం. ప్రపంచ చమురు ధరల అస్థిరత నుండి భారత మార్కెట్ను కాపాడి, పోల్చదగిన ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వం చాలా తక్కువ ఇంధన ధరల పెంపును అమలు చేయడానికి వీలు కల్పించింది” అని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.