మరో పెద్ద డీల్.. జీఎంఆర్ నుంచి అరబిందో చేతికి కాకినాడ సెజ్‌

కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌ జీఎంఆర్ చేజారింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌ను అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయిస్తున్నట్లు మౌలిక రంగ హైదరాబాద్‌ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా వెల్లడించింది.

మరో పెద్ద డీల్.. జీఎంఆర్ నుంచి అరబిందో చేతికి కాకినాడ సెజ్‌

Updated on: Sep 25, 2020 | 1:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో డీల్ కుదిరింది. కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌ జీఎంఆర్ చేజారింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌ను అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయిస్తున్నట్లు మౌలిక రంగ హైదరాబాద్‌ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా వెల్లడించింది. అనుబంధ సంస్థ జీఎంఆర్‌ సెజ్‌ అండ్‌ పోర్ట్‌ హోల్డింగ్‌ ద్వారా కేఎస్‌ఈజెడ్‌లో తమకుగల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ డీల్‌ విలువ మొత్తం రూ. 2,610 కోట్లు కాగా.. తొలి దశలో రూ.1,600 కోట్లను అందుకోనున్నట్లు జీఎంఆర్ తెలిపింది. తదుపరి రెండు, మూడేళ్లలో మిగిలిన రూ.1,010 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు వివరించింది. ఈ ఒప్పందం మేరకు కేఎస్‌ఈజెడ్‌లో వాటాతోపాటు.. కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌లో కేఎస్‌ఈజెడ్‌కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియల్టీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేఎస్‌ఈజెడ్‌ విక్రయానికి అరబిందో రియల్టీతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. పోర్ట్‌ ఆధారిత మల్టీ ప్రొడక్ట్‌ ప్రత్యేక ఆర్థిక మండలిగా కేఎస్‌ఈజెడ్‌ కార్యకలాపాలు సాగిస్తోంది.