ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం.. భారత రైతులకు కష్టాలు తప్పేలా లేవు! ఎలాగంటే?

మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా చమురు, గ్యాస్‌ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ ఘర్షణ ఎరువుల సరఫరా గొలుసును దెబ్బతీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హర్ముజ్ జలసంధి మూసివేతతో భారతదేశానికి యూరియా దిగుమతులకు ఆటంకం కలగవచ్చు.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం.. భారత రైతులకు కష్టాలు తప్పేలా లేవు! ఎలాగంటే?
Farmer

Updated on: Mar 16, 2026 | 3:56 PM

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం 11 రోజులు దాటడంతో చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ పరిస్థితి ఎరువుల సరఫరాపై కూడా ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం భారత రైతులపై పడే అవకాశముంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇరాన్ కీలక సముద్ర మార్గమైన హర్ముజ్‌ ను మూసివేసినట్లు సమాచారం. ఈ మార్గం ద్వారా ప్రపంచానికి భారీ స్థాయిలో చమురు, గ్యాస్‌తో పాటు ఎరువుల ముడి పదార్థాలు సరఫరా అవుతాయి. భారతదేశానికి వచ్చే యూరియాలో సుమారు 70 శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందువల్ల ఈ మార్గం మూసివేయబడటం భారత వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

అయితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ ప్రత్యామ్నాయ దిగుమతులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్ పంటల సీజన్‌కు ముందు ఇండోనేషియా, బెలారస్, మొరాకో, జోర్డాన్, రష్యా, చైనా వంటి దేశాల నుంచి ఎరువుల కొనుగోళ్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరఫరాను విభిన్న దేశాల నుంచి పొందడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో డైఅమోనియం ఫాస్ఫేట్ (DAP), యూరియా ఎరువులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. ఇప్పటివరకు ఈ సరఫరాలో ఎక్కువ భాగం పశ్చిమాసియా దేశాల నుంచే వచ్చేది. ముఖ్యంగా ఒమన్‌ యూరియా సరఫరాలో ముందుండగా, సౌదీ అరేబియా భారత్‌కు డీఏపీ ఎగుమతిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులు పెంచడం వల్ల సరఫరా సమస్య కొంతవరకు తగ్గవచ్చు. అయితే షిప్పింగ్ మార్గాలు మారడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 36.6 శాతం పెరిగి 18.01 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు కొంత ఉపశమనాన్ని ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ సంక్షోభం సహజ వాయువు సరఫరాపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఖతర్‌ నుంచి వచ్చే ఎల్‌ఎన్‌జీ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగం దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ఎరువుల ఉత్పత్తి, గ్యాస్ సరఫరా, వ్యవసాయ వ్యయాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us