
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధి వంటి సమస్యాత్మక మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ భారత్ తన వ్యూహాన్ని మార్చింది. సురక్షితమైన ఇతర మార్గాల ద్వారా దిగుమతులను 10శాతం పెంచడం ద్వారా ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం మన దేశం వద్ద తగినంత ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉండటం గమనార్హం. ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ పెజెష్కియన్ పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇచ్చిన హామీతో హార్ముజ్ జలసంధిలో ఓడల రాకపోకలు పునఃప్రారంభం కావడం మరో సానుకూల అంశం.
గత 12 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ ధర రూ.500 నుండి రూ.610కి చేరింది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఎల్పిజి సరఫరాపై స్వల్ప ఆందోళనలు ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఖతార్లోని రాస్ లఫాన్ కేంద్రం తాత్కాలికంగా మూతపడినప్పటికీ, భారత్ వద్ద మిగులు LNG నిల్వలు ఉన్నాయి. సరఫరా పునరుద్ధరణకు ఖతార్ హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఇతర దేశాలు కూడా భారత్కు గ్యాస్ సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎరువుల ఉత్పత్తికి గ్యాస్ కీలకం కావడంతో ఎరువుల మంత్రిత్వ శాఖతో ఉన్నత స్థాయి చర్చలు జరిపి ఎటువంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ, ముందస్తు ప్రణాళిక, సరఫరా మార్గాల వైవిధ్యీకరణ ద్వారా భారత్ తన ఇంధన అవసరాలను సురక్షితం చేసుకుంది. ఇది నిత్యావసర ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించనుంది.