
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తమ ఖాతాదారులకు మరో తీపికబురు అందించింది. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా దీనికి గరించి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని, వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో దీనిని అభివృద్ది చేస్తున్నారు. వివిధ టెక్ కంపెనీలతో కలిసి ఎన్పీసీఐ ఈ ఫీచర్ను డెవలప్ చేస్తోంది.
యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేసుకునే అంశంపై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఈ ఫీచర్ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు సులభంగా, వేగవంతంగా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పీఎఫ్ ఖాతాను యూపీఐతో అనుసంధానం చేస్తారు. దీని ద్వారా యూపీఐలో మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అనంతరం యూపీఐ ద్వారానే విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా మీ మీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సెకన్ల వ్యవధిలోనే పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇక యూపీఐతో పాటు ఏటీఎం సేవలను కూడా ఈపీఎఫ్ఓ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ను విత్ డ్రా చేసుకోవచ్చు. మీ సమీపంలోని ఏదైనా బ్రాంచ్ ఏటీఎంకు వెళ్లి ఉపసంహరించుకునే అవకాశం ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం డెబిట్ కార్డు తరహాలోనే ఈపీఎఫ్ ప్రత్యేక ఏటీఎం కార్డును జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేక కార్డు ద్వారా పీఎఫ్ ఖాతాదారులు ఏదైనా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ సంస్థ ఇటీవల విత్ డ్రాయల్ సేవలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆటో సెటిల్మెంట్ విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టుకున్న 24 నుంచి 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తోంది. దీని వల్ల పీఎఫ్ చందాదారులు రోజుల తరబడి క్లెయిమ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండటం లేదు. నిమిషాల్లోనే యూపీఐ, ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు, ఎక్కడైనా ఉపసంహరించుకోవచ్చు.