
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులకు పెద్ద ఊరట కలిగించింది. నిబంధనల్లో కీలక మార్పు చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్లోని సొమ్ము మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు ఎటువంటి కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అర్హులైన సభ్యులు ఇకపై ఎలాంటి కారణం చెప్పకుండానే తమ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. 100 శాతం సొమ్మును తీసుకోవచ్చు. క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడం, అవసరమైన ఉద్యోగులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చూసేందుకు ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
గతంలో ప్రత్యేక సందర్బాల్లో పూర్తి పీఎఫ్ను ఉపసంహరించుకోవడానికి సభ్యులు కారణాన్ని అందించాల్సి వచ్చేది. అలాగే సంబంధిత పత్రాలు, రుజువులు కూడా సమర్పించాల్సి ఉండేది. కారణం, డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే అధికారులు క్లెయిమ్లు రిజెక్ట్ చేసేవారు. ఈ క్రమంలో ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ పెద్ద ఉపశమనం కలిగిస్తూ తాజాగా నిబంధనల్లో పెద్ద మార్పు చేసింది. ఇక నుంచి అర్హులైన సభ్యులు ఎటువంటి కారణం చెప్పకుండానే ప్రత్యేక కేసు కింద 100 శాతం సొమ్ము తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం బ్యాలెన్స్లో 75 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకునేలా నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం తీసుకునేలా నిబంధనలు మార్చారు. క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉద్యోగులకు నిధులు అందేలా చేసేందుకు ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పీఎఫ్ సంస్థ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్లో మార్పులకు శ్రీకారం చుడుతోంది. క్లెయిమ్స్ వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-15 రోజుల కంటే ఎక్కువ కాలం కంపెనీ లాకౌట్ లేదా మూసివేయడం జరిగితే 100 శాతం సొమ్ము తీసుకోవచ్చు.
-నష్టపరిహారం లేకుండా ఉద్యోగి నిరుద్యోగిగా మారితే బ్యాలెన్స్ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు
-రెండు నెలల కంటే ఎక్కువ కాలం జీతం అందుకోకపోతే మొత్తం ఉపసంహరించుకోవచ్చు
– ఉద్యోగి కేసు కోర్టులో పెండింగ్లో ఉండటం, తొలగింపు, ఉద్యోగ విరమణ, ఉద్యోగ కోత సందర్భాలలో మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు.
– సుదీర్ఘకాలం కంపెనీ మూసివేసిన సందర్భాల్లో తీసుకోవచ్చు
-ఉద్యోగి నిరుద్యోగిగా మారిన సందర్భంలో తీసుకోవచ్చు
– తీవ్రమైన అనారోగ్యం లేదా కుటుంబ వైద్య చికిత్సకు సంబంధించిన కేసులలో కూడా పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం తీసుకునేలా వెసులుబాటు కల్పించారు.