EPFO: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. పీఎఫ్ విత్ డ్రా మరింత ఈజీ.. 100 శాతం మనీ తీసుకోవచ్చు..

PF అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ.. కోట్లాది మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ను చాలా సింపుల్‌గా మార్చేశారు. ఇకపై మీకు అర్హత ఉన్న మొత్తంలో 100 శాతం వరకు తీసుకోవచ్చు. గతంలో ఉన్న 13 కష్టమైన రూల్స్ పోయాయి. అలాగే, పిల్లల చదువుల కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 సార్లు వరకు డబ్బు తీసుకోవచ్చు.

EPFO: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. పీఎఫ్ విత్ డ్రా మరింత ఈజీ.. 100 శాతం మనీ తీసుకోవచ్చు..
Employees Can Now Withdraw 100% Of Pf Balance

Updated on: Oct 13, 2025 | 9:54 PM

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్స్ నుంచి డబ్బు విత్‌డ్రా నిబంధనలను చాలా ఈజీగా చేస్తూ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీని వల్ల దాదాపు ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ప్రయోజనం చేకూరనుంది.

విత్‌డ్రా నిబంధనల్లో భారీ మార్పులు

పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఉద్యోగి, యజమాని వాటా సహా పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న విత్‌డ్రా చేసుకోదగిన బ్యాలెన్స్‌లో 100 శాతం మొత్తాన్నిత తీసుకోవచ్చు. ఇది పీఎఫ్ వినియోగదారులకు అతి పెద్ద ఊరట అని చెప్పొచ్చు. పాక్షిక విత్ డ్రాకు సంబంధించిన గతంలో ఉన్న 13 సంక్లిష్టమైన నిబంధనలను సీబీటీ రద్దు చేసి, వాటిని కేవలం ఒకే నిబంధనగా మార్చింది. ఈ కొత్త రూల్‌ను మూడు రకాలుగా విభజించారు: ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా మార్చింది.

విత్‌డ్రా లిమిట్ పెంపు.. సర్వీస్ తగ్గింపు

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్లను కూడా ఈపీఎఫ్ఓ భారీగా పెంచింది. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం పీఎఫ్ తీసుకోవడానికి ఉన్న పరిమితిని పాత రూల్స్‌లో ఉన్న 3 సార్ల నుంచి 10 సార్లకు పెంచింది. అదేవిధంగా వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు ఉన్న లిమిట్‌ను 3 సార్ల నుంచి 5 సార్ల వరకు పెంచింది. అంతేకాకుండా అన్ని రకాల పాక్షిక విత్ డ్రాకు పీఎఫ్ ఖాతాదారుల కనీస సర్వీసును గతంలో ఉన్న దాని కంటే తగ్గించి కేవలం 12 నెలలకు మాత్రమే నిర్ణయించారు.

కారణం చెప్పకుండానే డబ్బులు తీసుకోవచ్చు!

పీఎఫ్ ఖాతాదారులకు ఇది మరో ముఖ్యమైన వెసులుబాటు. గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పార్షియల్ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు లేదా కంపెనీ మూసివేత వంటి నిర్దిష్ట కారణాలు చూపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం,, ఖాతాదారులు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు చేసుకుని పీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

పెన్షన్ నిధి భద్రతకు కొత్త రూల్

పీఎఫ్ ఖాతాదారులు భవిష్యత్తులోనూ అధిక ప్రయోజనం పొందడానికి వీలుగా ఒక కొత్త నియమాన్ని అమలులోకి తెచ్చారు. అదేంటంటే పీఎఫ్ అకౌంట్‌లో జమ చేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా తప్పనిసరిగా ఉంచేలా రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల పదవీ విరమణ సమయంలో ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ ప్రయోజనాన్ని పెద్ద మొత్తంలో పొందేందుకు వీలవుతుంది. ఈ మార్పుల ద్వారా ఉద్యోగులు తమ ప్రస్తుత ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూనే, పదవీ విరమణ నిధికి కూడా భద్రత కల్పించినట్లయింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..