
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఎలాంటి పన్ను మినహాయింపులు, పథకాలు ప్రవేశపెడతారనే విషయంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరో మూడు రోజులు మాత్రమే బడ్జెట్ ప్రకటనకు సమయం ఉండటంతో ప్రజల్లో అంచనా పెరిగిపోతున్నాయి. ఇక పరిశ్రమలకు ట్యాక్స్ మినహాయింపులు, జీఎస్టీ రేట్లలో సవరణలు, ప్రోత్సాహకాలు బిజినెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇలా బడ్జెట్పై అందరూ ఆశలు పెట్టుకోగా.. ఉద్యోగులు ట్యాక్స్ శ్లాబుల్లో మినహాయింపులు, ఈపీఎఫ్ విత్ డ్రాలపై ట్యాక్స్ తగ్గింపుల గురించి ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి బడ్జెట్లో కేంద్రం భారీ శుభవార్త అందించనుందని వార్తలు వస్తున్నాయి.
ఈపీఎఫ్లో వార్షిక చందా రూ.2.65 లక్షలు లేదా యజమాని వాటా లేకపోతే రూ.5 లక్షలు దాటితే వచ్చే వడ్డీపై పన్ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఉపయోగపడేలా ఈ లిమిట్ను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో 2026 బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉండే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న లిమిట్ను రూ.10 లక్షల వరకు పెంచే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఈపీఎఫ్లో ఐదేళ్ల పాటు వరుసగా ఖాతాదారులుగా ఉంటే ఆ తర్వాత పీఎఫ్ విత్ డ్రాలపై పన్ను మినహాయింపు. దీనిని మూడేళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల లే ఆఫ్స్ ఎక్కువైన సమయంలో ఉద్యోగాలు తరచూగా మారాల్సి వస్తుంది. ఇక తరచుగా వివిధ కారణాలతో కొంతమంది ఉద్యోగులు మారుతూ ఉంటారు. దీంతో మూడేళ్ల తర్వాత పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసుకున్నా పన్ను మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉంటుందని వార్తలొస్తున్నాయి.
ఇక ఈపీఎఫ్ కనీస వేతన పరిమితి ప్రస్తుతం రూ.15 వేలుగా ఉంది. దీనిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్లో రూ.21 వేల వరకు కనీస వేతన పరిమితిని పెంచే అవకాశముందని చెబుతున్నారు. దీని వల్ల రూ.21 వేల వరకు శాలరీ తీసుకునేవారు ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోకి వస్తారు.
ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాదారులకు 60 ఏళ్లు తర్వాత కనీస పెన్షన్ రూ.వెయ్యి వరకు ఉండగా.. ఈ లిమిట్ను 11 ఏళ్లుగా పెంచలేదు. దీంతో ఇప్పుడు రూ.5 వేల వరకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.