భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ చెల్లింపులు అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల ఆర్బీఐ ఆదేశాల ప్రకారం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులకు యూపీఐ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇటీవల ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంకు ఆఫ్ బరోడా రూపే క్రెడిట్ కార్డుల యూపీఐ చెల్లింపులపై కూడా ఈఎంఐ సేవను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చెల్లింపులు చేసే రూపే బీఓబీ కార్డు హోల్డర్లు ఇకపై తమ చెల్లింపులను ఈఎంఐలను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆఫ్ బరోడా తీసుకొచ్చిన కొత్త సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆన్లైన్, ఆఫ్లైన్లో యూపీఐ యాక్సెప్ట్ చేసే బిజినెస్ లావాదేవీలకు ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. యూపీఐ యాప్లో తమ లావాదేవీ హిస్టరీను యాక్సెస్ చేయడం ద్వారా కస్టమర్లు తమ రూపే క్రెడిట్ కార్డ్తో చేసిన గత కొనుగోళ్లను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. బ్యాంకు ఆఫ్ బరోడా తీసుకొచ్చిన ఈ కొత్త సేవల పండుగ సీజన్లో సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలను అందిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఈఎంఐ సేవలను టైర్-2, టైర్-3 నగరాల్లోని ప్రజలు అధికంగా వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రూపే భాగస్వామ్యంతో యూపీఐ చెల్లింపులపై ఈఎంఐ ఫీచర్ను అందుబాటులోకి తీసుకుని రావడంపై బీఓబీ కార్డ్ లిమిటెడ్ హోల్టైమ్ డైరెక్టర్ రవీంద్ర రాయ్ స్పందించారు. కస్టమర్లకు మరిన్ని సేవలను అందించేందుకు ఈఎంఐ సర్వీస్ మంచి ఎంపిక అని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి