
ప్రస్తుతం బ్యాంకులతో పాటు బ్యాంకేంగేతర ఆర్థిక సంస్థలు కూడా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఖాతాకు తప్పనిసరిగా నామినీ పేరు ఉండాలని ఆదేశించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్ బీఎఫ్ సీ)లలో పెద్దసంఖ్యలో ప్రజలు ఖాతాలను ప్రారంభించారు. తమ అవసరాలకు అనుగుణంగా వాటి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా మంది తమ ఖాతాలకు నామినీ వివరాలు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని గమనించిన రిజర్వ్ బ్యాంకు పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. సేవింగ్స్ ఖాతాలు, డిపాజిట్లు, సేఫ్టీ లాకర్లు ఉన్నవారందరికీ నామినీ వివరాలను పొందుపర్చాలని బ్యాంకులను కోరింది. కొత్త ఖాతాదారులతో పాటు పాత వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆదేశించింది. బ్యాంకులు ఎప్పటికప్పుడు నామినేషన్ల గురించి సమీక్షించాలని, మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఆ వివరాలను తెలియజేయాలని ఆదేశించింది.
దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంటుంది. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో ప్రభుత్వం పథకాలు, ఇతర ప్రయోజనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అలాగే ఖాతాదారుడు కూడా వ్యక్తిగతంగా డబ్బులను కూడా దీనిలోనే దాచుకుంటాడు. అనుకోకుండా ఖాతాదారుడు మరణిస్తే… అతడి ఖాతాలోని డబ్బులను, ప్రయోజనాలను పొందే వారినే నామినీ అంటారు. ఖాతాదారుడు తన కుటుంబ సభ్యులు, నచ్చిన వారిని నామినీగా పెట్టుకోవచ్చు. తద్వారా ఖాతాదారుడి డబ్బు, ఇతర ప్రయోజనాలు అతడికి వెళతాయి. దీని వల్ల బ్యాంకులకు కూడా ఉపయోగం ఉంటుంది. డబ్బులను సకాలంలో ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. మరణించిన ఖాతాదారుడి కుటుంబంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి నామినీ అనేది చాలా అవసరం. దీని వల్ల ఖాతారుడి పెట్టుబడులను చట్టపరంగా నామినీకి బదిలీ అవుతాయి. ఒక వేళ ఖాతాదారుడికి నామినీ లేకపోతే… అతడి పెట్టుబడులు, ఇతర ప్రయోజనాలను పొందటానికి కుటుంబ సభ్యులు పోటీపడతారు. వారి మధ్య గొడవలు జరిగి కోర్టుల వరకూ వెళతారు. అవి పూర్తకావడానికి చాలా సమయం పడుతుంది. నామినీ ఉంటే ఇవేమీ లేకుండా సులువుగా పెట్టుబడులను అతడికి బదిలీ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి