
సామాన్యులపై ధరల భారం పెరిగింది. ఇంట్లో రోజూ ఉపయోగించే వస్తువుల ధరలను క్రమక్రమంగా తయారీ కంపెనీలు పెంచుతున్నాయి. డిటర్జెంట్ల నుంచి వంటె నూనె ధరల వరకు అన్నీ పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడటం, దిగుమతి ఖర్చు పెరిగిపోవడంతో ప్రజలపై ఈ భారాన్ని మోపుతున్నారు. కంపెనీలు లాభాలను పొందేందుకు ధరలను పెంచుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో ప్యాకేజీలు దుకాణాలకు వస్తున్నాయి. ఏయే ధరలు పెరిగాయి..? సామాన్యులపై ఎంత భారం పడనుంది..? పెంచడానికి కారణాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో సామాన్యులకు ఊరట కలిగించింది. ఇంట్లో రోజూ ఉపయోగించే పలు వస్తువుల ధరలు తగ్గాయి. కొన్ని రోజులు సంయమనం పాటించిన కంపెనీలు.. రూపాయి బలహీనత, పెరుగుతున్న ఖర్చులతో లాభాలు తగ్గిపోవడంతో వస్తువుల ధరలను 5 శాతం వరకు పెంచుతున్నాయి. డిటర్జెంట్లు, హెయిర్ కలర్స్, చాక్లెట్లు, నూడుల్స్, తృణ ధాన్యాల వరకు పెంచిన ధరలతో కొత్త ప్యాకెట్లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి. రియల్ జ్యూస్, వాటిక హెయిర్ ఆయిల్ తయారుచేసే కంపెనీ డాబర్ ఇండియా వీటి ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది.
రూపాయి కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. జనవరి 30న డాలర్తో పోలిస్తే జీవితకాల కనిష్ట స్థాయి రూ.92.02కు రూపాయి పడిపోయింది. దీంతో దిగుమతి ఖర్చులు పెరిగిపోవడం వల్ల ముడి చమురు ధరలతో పాటు సల్ఫర్, ఎన్ ఫారాఫిన్ వంటి సంబంధిత వస్తువులు, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. ఇక సబ్బులు, షాంపులు, డిటర్జెంట్లు, ఇతర వ్యక్తిగత సంరక్షణ వస్తువుల తయారీ కంపెనీలు ముడి చమురుతో తయారుచేసిన ఉత్పత్తులపై ఎక్కువ ఆధారపడతాయి. వీటి దిగుమతి ఖర్చు పెరగడం వల్ల ధరలను పెంచుతున్నాయి. ఇక ఓట్స్, బాదం వంటి బ్రేక్ ఫాస్ట్ ఆహార పదార్ధాలలో ఉపయోగించే అనేక పదార్ధాలను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వీటి ధరలు కూడా పెంచేశారు. ఇక వంట నూనె ధరలు కూడా పెరిగాయి.
సర్ప్ ఎక్సెల్, రెన్, నిమ్, డొమెక్స్ వంటి వాటి ధరల పెరిగాయి. పెరిగిన ధరలతో కూడిన ప్యాకెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇక టాటా టీ ప్యాకెట్ల ధరలు కూడా ఇప్పటికే పెరిగాయి. ఇక రానున్న నెలల్లో వీటి ధరలను మరింత పెంచనున్నట్లు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు.