
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు ప్రతీఒక్కరూ వినియోగిస్తున్నారు. ఆర్ధిక అవసరాలు ఎక్కువగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది తీసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం ఉద్యోగులు, వ్యాపారులు వద్ద ఉండే ఈ కార్డు.. ఇప్పుడు సామాన్యుల వద్ద కూడా కనిపిస్తోంది. విద్యార్థులు, చిరు ఉద్యోగులు కూడా దీనిని తీసుకుని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా షాపింగ్ డిస్కౌంట్ కోసం కార్డులు వాడుతూ ఉంటారు. అయితే అద్దె చెల్లించేందుకు కూడా క్రెడిట్ కార్డులను వినియోగించడం ఇటీవల బాగా ఎక్కువగా జరుగుతుంది. సిటీలలో ఎక్కువమంది ఈ విధానంలో చెల్లిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి రోజుల్లో అద్దె చెల్లించడం అనేది చాలా సులువుగా మారింది. కేవలం ఒకే క్లిక్తో ఇంటి యాజమాని బ్యాంక్ అకౌంట్లోకి నిధులు బదిలీ అవుతున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా మరింత సింపుల్గా పేమెంట్ చేయవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్పై నేరుగా ప్రభావితం పడుతుంది. అలాగే మీ రుణ ఖర్చులు, క్రెడిట్ వినియోగం కూడా దెబ్బతింటుంది. అలాగే అద్దె చెల్లింపునకు బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. బ్యాంకులతో పాటు చెల్లింపు ఫ్లాట్ఫామ్స్ కూడా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజులు 2 శాతం వరకు ఉండవచ్చు. ఉదాహరణకు మీరు రూ.30 వేలు చెల్లిస్తున్నారనుకుంటే.. 2 శాతం రుసుం అంటే రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి రూ.7200 అవుతుంది. ఇది అదనపు భారంగా చెప్పుకోవచ్చు. దీంతో అదనపు ఛార్జీల గురించి జాగ్రత్త పడండి.
ఇక మీ కార్డు క్రెడిట్ పరిమితి కూడా తగ్గిపోతుంది. మీ కార్డు లిమిట్ రూ.లక్ష అయితే రూ.40 వేలు అద్దెగా చెల్లిస్తే.. మీ పరిమితి 40 శాతం ఒకేసారి ఉపయోగించుకున్నట్లు అవుతుంది. మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని ఈ పరిణామం వేగంగా పెంచుతుంది. సిబిల్ స్కోర్ను నిర్ణయించడంలో క్రెడిట్ నిష్పత్తి అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిరంతరం ఎక్కువ క్రెడిట్ లిమిట్ వాడటం వల్ల సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుంది. ఇక మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం మర్చిపోతే.. చాలా నష్టం జరుగుతుంది. మీరు మీ కార్డ్ అద్దెను సమయానికి చెల్లించినప్పటికీ.. బిల్లు గడువు తేదీని కోల్పోవడం మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. లేట్ ఫీజులతో పాటు భారీగా వడ్డీ పడుతుంది. ఒక్క చెల్లింపు గడువు తేదీని కోల్పోవడం కూడా దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోర్ను తీవ్రంగా దెబ్బతీస్తుందని సరికా శెట్టి స్పష్టంగా పేర్కొన్నారు.