
హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్ల నిర్మాణం చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించగా.. దీనికి సంబంధించిన పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడు ప్రాజెక్టులను వేగంగా అమలు చేసే బాధ్యతలను ఫిబ్రవరిలో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో పనులపై మరింత వేగం పెరిగింది. ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.
ఇప్పటికే సిద్దం చేసిన ఈ ఏడు ప్రాజెక్టుల డీపీఆర్లకు సవరణలు చేయాలని ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్కు రైల్వేశాఖ అప్పగించింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులపై పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. రైల్వే స్థాయి కమిటీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సూచించింది. భూసేకరణ, ఇతర చట్టబద్దమైన అనుమతులు పూర్తి చేయాలని సలహా ఇచ్చింది. హైస్పీడ్ రైలు కారిడార్ల వల్ల భారతీయ రైల్వేల ముందుచూపును అభినందించింది. అమలును నిర్ధారించడానికి, ఆర్ధిక సాధ్యాసాధ్యాలను కాపాడటానికి అనుమతులు త్వరతగతిన పూర్తి చేయాలని రైల్వేశాఖకు పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో భూసేకరణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల జాప్యం జరిగిందని గుర్తు చేసింది. కాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్ పనులను రైల్వేశాఖ ఎప్పుడో చేపట్టింది. కానీ మహారాష్ట్రలో భూసేకరణ సమస్య వల్ల 2021 వరకు ప్రాజెక్టుపై ప్రభావం చూపింది. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1389.5 హెక్టార్ల భూమిని సేకరించారు. కాగా వచ్చే ఏడాది కల్లా తొలి బుల్లెట్ ట్రైన్ను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైళ్లు ప్రయాణం చేస్తాయి. దీంతో ప్రధాన నగరాలకు 3 గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. వేగవంతమైన ప్రయాణం ప్రజలకు అందనుంది. దీని వల్ల దేశంలో రైల్వేల స్వరూపమే పూర్తిగా మారనుంది. బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుతో కొత్త పరిశ్రమలు రానున్నాయి. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక హైదరాబాద్ నుంచి అమరావతి, చెన్నై, బెంగళూరు, పుణెకు కనెక్టివిటీ మరింత పెరగనుంది. దీంతో బుల్లెట్ రైళ్ల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూాడా ఎదురుచూస్తున్నారు.