
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ద్వారా దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ సౌకర్యం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల పీఎఫ్కు సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పథకం 2026ను కేంద్రం నోటిఫై చేసింది. 1952 నుండి అమల్లో ఉన్న ప్రస్తుత EPF పథకం స్థానంలో ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ కొత్త స్కీమ్ను సామాజిక భద్రతా నియమావళి, 2020 కింద ప్రవేశపెట్టారు. దీని వల్ల ప్రస్తుత పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలు, డిపాజిట్లు ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపదు. కేవలం డిజిటల్, పారదర్శక, జవాబుదారీగా మార్చడమే ఈ కొత్త పథకం లక్ష్యం.
ప్రస్తుతం ఉన్న పీఎఫ్ క్లెయిమ్, 12 శాతం వాటా, యూఏఎన్ పోర్టల్ లాంటివి యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం డిజిటల్ సేవలు, పారదర్శకతపై ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. డిజిటల్ ప్రక్రియలను అధికారికంగా గుర్తిస్తుంది. ఆన్లైన్ రిటర్న్ ఫైలింగ్, డిజిటల్ రికార్డ్ కీపింగ్, ఆన్లైన్ క్లెయిమ్ సమర్పణ, ఎలక్ట్రానిక్ వార్షిక నివేదిక జారీ, డిజిటల్ తనిఖీ వంటి సేవలు ఈ కొత్త విధానంలో అందిస్తారు. దీంతో పీఎఫ్ సేవలు మునుపెన్నడూ లేనంతగా మరింత అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ కొత్త పథకం సొంత పీఎఫ్ ట్రస్టులను నిర్వహించే కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేస్తుంది. ట్రస్టీల నియామకం, క్రమమైన సమావేశాలు, ఎలక్ట్రానిక్ అకౌంటింగ్, వార్షిక ఆడిట్లు, పెట్టుబడి నివేదన, ఆన్లైన్ వెల్లడింపుల వంటి నిబంధనలను కఠినతరం చేయనుంది. ఈ కొత్త పథకం ద్వారా మహమ్మారి, జాతీయ విపత్తు లేదా ఇతర అసాధారణ పరిస్థితుల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా మూడు నెలల కాలం పాటు ఈపీఎఫ్ చెల్లింపులను తాత్కాలికంగా తగ్గించడానికి లేదా వాయిదా వేయడానికి అధికారం ఉంటుంది. కేవలం అత్యవసర పరిస్థితులకు మాత్రమే ఇది. వర్తిస్తుంది. శాశ్వత ఈపీఎఫ్ చెల్లింపుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు.
పీఎఫ్ వడ్డీ త్వరలోనే జమ కానుంది. ఈ నెలలో వడ్డీ జమ కానుందని తెలుస్తోంది. ఈపీఎఫ్వో సిస్టమ్ అప్గ్రేడేషన్ చేపడుతోంది. ఇందుకోసం జూన్ 26వ తేదీ నుంచి జులై 1 వరకు పీఎఫ్ ఆన్ లైన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. జులై 2 నుంచి తిరిగి అందుబాటులోకి రానున్నాయి. దీంతో త్వరలోనే పీఎఫ్ వడ్డీ జమ కానుందని సమాచారం.