
సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోదానికే పరిమితం కాలేదు. వ్యాపారాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ప్రజలకు చేరువయ్యేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి డిజిటల్ వేదికలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సోషల్ మీడియా క్రియేటర్లకు భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వీడియోలు రూపొందించి మంచి వ్యూవ్స్ సాధించే ఎంపికైన క్రియేటర్లకు డబ్బులు చెల్లించేందుకు నిర్ణయించింది.
కొత్త నిబంధనల ప్రకారం అర్హత కలిగిన క్రియేటర్ రూపొందించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోకు లక్ష వ్యూవ్స్ వస్తే గరిష్ఠంగా రూ.10 వేలు చెల్లించే అవకాశం ఉంది. అదే వీడియో 10 లక్షల వ్యూవ్స్ సాధిస్తే రూ.1 లక్ష వరకు పొందవచ్చు. అయితే 10 లక్షలకు మించి వ్యూవ్స్ వచ్చినా ఒక్క వీడియోకు చెల్లించే మొత్తం గరిష్ఠంగా రూ.1 లక్ష మాత్రమే చెల్లిస్తారు.
అయితే వీడియో వైరల్ అయినంత మాత్రాన వెంటనే డబ్బులు రావు. నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉండే కంటెంట్కే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది. వీడియోకు వచ్చిన వ్యూవ్స్ను నిర్ణీత వ్యవధి తర్వాత పరిశీలించి, ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా చెల్లింపు చేస్తారు. కంటెంట్ నాణ్యత, ప్లాట్ఫామ్, వ్యూవ్స్ ధ్రువీకరణ వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇక్కడ మరో ముఖ్యమైన నిబంధన ఉంది. ప్రతి సోషల్ మీడియా ఖాతాకు ఈ డబ్బులు లభించవు. వ్యక్తిగత క్రియేటర్లు, రిజిస్టర్డ్ కంపెనీలు ముందుగా బీహార్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంప్యానెల్ కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేదా ఎంప్యానెల్మెంట్ లేకుండా రూపొందించిన వీడియోలకు ఈ చెల్లింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బీహార్ ప్రభుత్వం Bihar Social Media and Other Online Media Rules, 2026లో మార్పులు చేసింది. ఎంప్యానెల్ అయిన క్రియేటర్ల సోషల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు, ఛానళ్లలో ఉన్న ఫాలోవర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు తనిఖీ చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.