
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందుతుంది. అదే ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్వో ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ వస్తుంది. ఈపీఎఫ్వో సౌకర్యం లేనివారికి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పెన్షన్ ప్రయోజనాలు ఉండవు. అంతేకాకుండా వివిధ రంగాల్లో పనిచేసేవారికి పీఎఫ్ సౌకర్యం అనేది ఉండదు. ఈ క్రమంలో అసంఘటిత రంగంలో పనిచేసేవారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో కొంతమొత్తంలో ప్రీమియం చెల్లిస్తే.. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో ఎవరెవరు చేరవచ్చు..? ఎంత పింఛన్ వస్తుంది? అనే విషయాలు చూద్దాం.
2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఇందులో చేరేందుకు అర్హులు. 60 ఏళ్లు వచ్చేంతవరకు కొంత మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే.. అందుకు సమానంగా ప్రభుత్వం మరికొంత చెల్లిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మీకు నెలనెలా పెన్షన్ వస్తుంది. మీ చెల్లించే ప్రీమియంను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అంటే ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.60 వేల వరకు పొందవచ్చు. మీకు రూ.5 వేల పెన్షన్ కావాలంటే ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.వెయ్యి కావాలంటే తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక మీ వయస్సును బట్టి కూడా ప్రీమియం మారుతూ ఉంటుది. చిన్న వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది చేరితో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీ సమీపంలోని ఏదైనా బ్యాంక్కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. లేదా పోస్టాఫీస్ ద్వారా అయినా చేరవచ్చు. ప్రీమియం మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. అలాగే 60 ఏళ్ల తర్వాత మీ అకౌంట్లోనే నెలనెలా పెన్షన్ జమ అవుతుంది.
ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి 60 ఏళ్ల తర్వాత మరణిస్తే జీవిత భాగస్వామికి ప్రతీ నెలా పెన్షన్ లభిస్తుంది. జీవిత భాగస్వామి మరణించేంత వరకు పెన్షన్ వస్తుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 13.5 మిలియన్ల మంది కొత్తగా అటల్ పెన్షన్ యోజనలో చేరారు. 2026 ఏప్రిల్ 21 నాటికి 9 కోట్ల మందికి చేరుకోగా.. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా రిటైర్మంట్ తర్వాత ఆర్ధిక భరోసా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు లభిస్తుంది.