
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు జూన్ 3న ప్రారంభమవ్వగా.. జూన్ 5 వరకు జరగనున్నాయి. శుక్రవారంతో సమావేశాలు ముగియనుండగా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలు తెలుసుకునేందుకు మార్కెట్లు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి బలహీనపడుతున్న క్రమంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై కేంద్ర బ్యాంక్ వైఖరిని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేస్తారు. దీని అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఉంటుంది. ఈ మీడియా సమావేశంల వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ విధానంపై సమాచారాన్ని అందించనున్నారు. అయితే గత సమావేశంలో 2027 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కూడా 4.6 శాతానికి పెంచింది. ఈసారి ద్రవ్యోల్బణం, ప్రపంచ సవాళ్లు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి అంచనాలు ఇస్తుందనేది హాట్టాపిక్గా మారింది.
కాగా ఆర్బీఐకి సంబంధించి ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ జూన్ 3వ తేదీన సమావేశమవ్వగా.. జూన్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహిస్తున్నారు. మూడు రోజుల చర్చల అనంతరం జూన్ 5వ తేదీన తన నిర్ణయాన్ని ఆర్బీఐ బహిరంగపరచనుంది. ఈ నిర్ణయం బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, రుణాల వ్యయంపై ప్రభావం చూపవచ్చు. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే రుణాలు తక్కువ వడ్డీకే లభించునున్నాయి. అలాగే ఈఎంఐలు తగ్గనున్నాయి.