నిర్భయ కేసులో నలుగురు దోషులనూ తాను ఉరి తీస్తానని, అందుకు ప్రభుత్వం ఇచ్ఛే లక్ష రూపాయల పారితోషికంతో తన కూతురి పెళ్లి జరిపిస్తానని అంటున్నాడు మీరట్ తలారి పవన్ జలాద్. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూపీ ప్రభుత్వానికి, తీహార్ జైలు అధికారులకు, భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. తన కుమార్తె వివాహానికి తనకు డబ్బులు అవసరమని, ఈ కేసులో దోషుల ఉరితీత కోసం తాను నాలుగు నెలలుగా వేచి ఉన్నానని అన్నాడు. మీరట్ లోని అధికారులు ఇతనికి ప్రత్యేకంగా ఓ ఇంటిని కేటాయించి.. జిల్లా వదిలి వెళ్లరాదని కోరారట. ‘ నాకు యూపీ ప్రభుత్వం నెలకు కేవం 5 వేల రూపాయల జీతాన్ని చెల్లిస్తోంది. ఈ రోజుల్లో ఇది ఏమాత్రం సరిపోతుంది చెప్పండి.. నేను ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది.. ఈ కేసులోని నలుగురు దోషుల ఉరితో కొంత ఊరట పొందుతాను కూడా ‘ అన్నాడు పవన్ జలాద్. ఒక్కో వ్యక్తినీ ఉరి తీసినందుకు 25 వేల రూపాయలు చెల్లిస్తారని, ఇప్పుడు నలుగురు దోషులున్నారు గనుక తనకు మొత్తం లక్ష వరకు ‘ రివార్డు ‘ వస్తుందని ఆశగా చెప్పాడు. నిర్బయ కేసులో దోషులను ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అటు-పవన్ జలాద్ తండ్రి మామూ జలాద్ కూడా తలారే.. ఈ వంశంలో పవన్ జలాద్ నాలుగో తరం తలారి అట.