ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని ప్రకటించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ. 38 వేల కోట్లకు పైగా సొమ్ము లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేని పక్షంలో మన దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయంపట్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ షేర్లలో మెరుగైన వృద్ది కనిపించింది. మార్చి మాసాంతానికి 86 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులతో ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ దేశంలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థగా పాపులర్ అయింది. రెండు దశాబ్దాల క్రితం ఇది ఏర్పాటైంది.
కాగా… రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్నిపి. చిదంబరం స్వాగతించారు. రెండు రోజుల క్రితం తాను వెలిబుచ్చిన ఆందోళన నేపథ్యంలో సకాలంలో బ్యాంకు ఈ నిర్ణయాన్ని తీసుకుందంటూ ఆయన ట్వీట్ చేశారు.