రెచ్చిపోయిన నాగబాబు.. టీడీపీ మీద జోరుగా ట్వీట్లు

|

May 30, 2020 | 3:23 PM

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, రెండ్రోజులు కాకముందే నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు తన గురిని తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఎక్కుపెట్టారు.

రెచ్చిపోయిన నాగబాబు.. టీడీపీ మీద జోరుగా ట్వీట్లు
Follow us on

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, రెండ్రోజులు కాకముందే నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు తన గురిని తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఎక్కుపెట్టారు. వైసీపీ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు అన్న మాటలతో మొదలుపెట్టిన నాగబాబు.. వైసీపీతో సహా ఏ పార్టీ అయితే ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ వుంది కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ ఘాటైన కామెంట్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు నాగబాబు.

సినిమాల షూటింగుల పునరుద్ధరణ, ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చేయూత కోసం నిర్వహించిన సినీ పెద్దల సమావేశాలకు తనను పిలవలేదంటూ తప్పు పట్టిన బాలకృష్ణపై రెండ్రోజుల క్రితం ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. శనివారం ట్విట్టర్ వేదికగా టీడీపీపై విరుచుకుపడ్డారు. తమ హయాంలో తెలుగుదేశం నేతలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కేవలం అవినీతి పాలనను అందించారని అంటూ నాగబాబు చేసిన ట్వీట్లు ఇపుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

మరోసారి అధికారంలోకి వస్తామని కలలు కనే తెలుగుదేశం నేతలు ఊహాజనిత ప్రపంచం నుంచి బయటికి రావాలని, లేకపోతే వారిని మానసిక రోగులుగానే పరిగణించాల్సి వస్తుందని నాగబాబు సెటైర్లు వేశారు. పగటి కలల్లోనే జీవిస్తామని ఎవరైనా అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాగబాబు వ్యాఖ్యలిపుడు ఏపీలో రాజకీయ రచ్చకు తెరలేపాయని విశ్లేషకులు అంటున్నారు.