ఓవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే ఇతరత్రా వ్యవహారాలపై సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మార్చి రెండోవారంలో తనను ఇరుకున పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రెండ్రోజుల క్రితం ప్రత్యేక జీవోల ద్వారా తొలగించిన ముఖ్యమంత్రి.. తాజాగా రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణలోను తన దూకుడు తగ్గలేదని చాటుకున్నారు. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న సిట్కు అనుకూల వాతావరణాన్ని సెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
రాజధాని భూములు విచారణలో జగన్ ప్రభుత్వం దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణకు సిట్ను నియమించింది ప్రభుత్వం. తాజాగా సిట్కు చీఫ్ లీగల్ అడ్వైజర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అడ్వకేట్ ఐనకొల్లు వెంకటేశ్వర్లును రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి చీఫ్ లీగల్ అడ్వైజర్గా నియమించింది జగన్ సర్కార్. రాజధాని భూ కుంభకోణం విచారణలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం.