ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 61 కేసులు నమోదవడంతో… మొత్తం కేసుల సంఖ్య 1016కి చేరింది. వైరస్ బాధితుల్లో మరో ఇద్దరు చనిపోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, ప్రస్తుతం 814 మంది కరోనాతో ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 6928 శాంపిల్ టెస్టులు జరపగా… వారిలో 61 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. పాతపట్నం మండలంలో ముగ్గురికి కరోనా సోకిందని ప్రభుత్వం కొద్ది సేపటి కిందట విడుదల చేసిన మెడికల్ బులిటెన్ లో పేర్కొంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగడా నమోదైన కేసులలో అనంతపురం జిల్లాలో 5 తూర్పుగోదావరి జిల్లాలో 3 ఉన్నాయి. అలాగే కృష్ణా జిల్లాలో25 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 4 కేసులు ఈ రోజు కొత్తగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 14 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో తొలి సారిగా మూడు కేసులు నమోదయ్యాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 61 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, రాష్ట్రంలో జిల్లాల వారిగా కరోనా కేసుల సంఖ్య పోల్చుకుంటే 275 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా, 209 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జిల్లాలపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇక, కృష్ణా జిల్లా విజయవాడలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం మొత్తంలో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాగా విజయనగరం ఉంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కు పెరిగింది.