ఆ 3 కాలేజీలకు ఇంటర్ బోర్డ్ షాక్.. ఎందుకంటే ?
తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చొచ్చుకుపోయిన విద్యాసంస్థలకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు షాకిచ్చారు. అయితే ఇది వారు నిబంధనలకు అనుగుణంగా క్యాంపస్లను నడుపుతున్నందుకు కాదు. మరేంటా రీజన్.. ఏంటా షాక్ అనుకుంటున్నారా ? ఈ స్టోరీ చదవండి.. ఆర్టీసీ సమ్మె తెలంగాణలో జనజీవనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొండికేస్తున్న కార్మిక సంఘాలను దారిలోకి తెచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ప్రజల ఇబ్బందులను నివారించేందుకు యధాశక్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది కెసీఆర్ ప్రభుత్వం. అయితే.. ఎన్ని […]
తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చొచ్చుకుపోయిన విద్యాసంస్థలకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు షాకిచ్చారు. అయితే ఇది వారు నిబంధనలకు అనుగుణంగా క్యాంపస్లను నడుపుతున్నందుకు కాదు. మరేంటా రీజన్.. ఏంటా షాక్ అనుకుంటున్నారా ? ఈ స్టోరీ చదవండి..
ఆర్టీసీ సమ్మె తెలంగాణలో జనజీవనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొండికేస్తున్న కార్మిక సంఘాలను దారిలోకి తెచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ప్రజల ఇబ్బందులను నివారించేందుకు యధాశక్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది కెసీఆర్ ప్రభుత్వం. అయితే.. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. ఆర్టీసీ పూర్తి స్థాయిలో నడిచినంతగా ప్రత్యామ్నాయ వసతులు సరిపోవడం లేదు. దాంతో విద్యార్థుల ఇబ్బందులను అరికట్టేందుకు అక్టోబర్ 19వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులను పొడిగించింది.
దాంతో పాఠశాలలన్నీ సెలవులను పొడిగిస్తూ విద్యార్థులకు సందేశాలు పంపాయి. అయితే.. కాలేజీలు ముఖ్యంగా తెలంగాణలో విపరీతంగా విస్తరించిన కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రీ విద్యాసంస్థలు మాత్రం తమ క్యాంపస్లలో తరగతులను ఈనెల 15న ప్రారంభించాయి. అయితే ఆ రోజున విద్యార్థులు తరగతి గదుల్లో వుండగానే.. పలు విద్యార్థి సంఘాలు కాలేజీలను ముట్టడించాయి. విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశాయి.
కానీ, ఈ మూడు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రీ విద్యాసంస్థలకు చెందిన 15 క్యాంపస్లలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.జయప్రదా బాయి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తరగతులు నిర్వహిస్తున్న విషయం గుర్తించి 3 కాలేజీల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు అధికారులు.
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే.. కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు.. పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అధికారుల ఆగ్రహంతో స్పందించిన 3 కాలేజీల యాజమాన్యాలు సాధారణ తరగతులను మాత్రం రద్దు చేసి… ఎలైట్ బ్యాచ్ విద్యార్థులకు రహస్యంగా తరగతులు నిర్వహిస్తుండడం విశేషం. సాధారణ బ్యాచ్ విద్యార్థులకు క్లాసులు జరగకుండా అడ్డుకున్న ఇంటర్ బోర్డు అధికారులు ఎలైట్ బ్యాచ్ పేరిట నిర్వహిస్తున్న తరగతులపై ఫోకస్ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.