
YSRCP Bus Yatra: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది పార్టీ. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వైసీపీ సామాజిక న్యాయ యాత్ర కు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ అధిష్టానం ఫిక్స్ చేసింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఎమ్మెల్యేలు, స్థానిక సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..