YSR Asara: ‘వైఎస్సార్ ఆసరా’ సొమ్ముల జమ నేడే.. ఒంగోలులో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి

|

Oct 07, 2021 | 10:56 AM

ఆంధ్రప్రదేశ్‌లో 'వైఎస్సార్ ఆసరా' సొమ్ములు లబ్ధిదారులకు నేడే విడుదల చేయబోతున్నారు. ఒంగోలులో సీఎం వైయస్ జగన్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

YSR Asara: వైఎస్సార్ ఆసరా సొమ్ముల జమ నేడే.. ఒంగోలులో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి
Ysr Aasara
Follow us on

YSR Asara money: ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్ ఆసరా’ సొమ్ములు లబ్ధిదారులకు నేడే విడుదల చేయబోతున్నారు. ఒంగోలులో సీఎం వైయస్ జగన్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్.. వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

కాగా, ఈ కార్యక్రమానికి ఎన్నికల సంఘం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు కానీ.. పథకం కొత్తది కాకపోవటంతో రెండో విడత కార్యక్రమం అమలుకు క్లియరెన్సు ఇచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావటంతో (గురువారం) ఈ ఉదయం ఒంగోలులో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు సభ జరుగుతుందని, లబ్ధిదారులతో సీఎం జగన్‌ ముఖాముఖి మాట్లాడుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇలాఉండగా, వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 8 లక్షల 42 వేల డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల 599 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొత్తం రూ. 25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని గవర్నమెంట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది సెప్టెంబరు 11న రూ. 6330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా సెప్టెంబరు నెలలోనే చెల్లించాలని భావించినా.. నిధులు కొరత ఉండటంతో ఆసరా రెండో విడత అమలును అక్టోబరు 7కు వాయిదా వేశారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ఆలోచన చేస్తే.. అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ప్‌ సిబ్బంది తోడ్పాటు అందిస్తారు.

ఇక, ఈ ఉదయం 9.55 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో హెలికాప్టర్‌ దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్‌ నుంచి బయల్దేరి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిముషాలపాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.

ఈ ఉదయం 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు.

Read also: Modi Cabinet: దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు.. రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు