YS Jagan: ఘోర పరాజయంపై వైఎస్ జగన్ సమీక్ష.. వైసీపీ కార్యాలయంపై కీలక నిర్ణయం

|

Jun 06, 2024 | 9:02 PM

అంచనాలన్నీ తలకిందులయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోర పరాజయం పాలైంది.. కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి..? ఎక్కడ తప్పిదం జరిగింది.. వైసీపీని ఓడించిన విధానాలేంటి? ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి..? ఇలా ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.

YS Jagan: ఘోర పరాజయంపై వైఎస్ జగన్ సమీక్ష.. వైసీపీ కార్యాలయంపై కీలక నిర్ణయం
YS Jagan
Follow us on

అంచనాలన్నీ తలకిందులయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోర పరాజయం పాలైంది.. కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి..? ఎక్కడ తప్పిదం జరిగింది.. వైసీపీని ఓడించిన విధానాలేంటి? ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి..? ఇలా ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో ఓటమిపై కారణాలను విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలినాని, గురుమూర్తి, శివప్రసాద్‌రెడ్డి, దేవినేని అవినాష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఓటమి గల కారణాల విశ్లేషణతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యక్తలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. అంతేకాకుండా పలు వివరాలను నేతల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలు సూచనలు సైతం చేశారు.

ఓటమి అనంతరం పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని.. పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని.. పార్టీ శ్రేణులకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని వైయస్‌ జగన్‌ నాయకులను ఆదేశించారు. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నామని, గవర్నర్‌ కు కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని వైయస్ జగన్‌ తెలిపారు.

Ys Jagan

అంతకుముందు.. వైసీపీ కార్యకర్తలపై దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందని గవర్నర్‌ జోక్యం కోరుతూ జగన్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది.. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు. గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకొని టీడీపీ ఆరాచకాలను అడ్డుకోవాలని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు..

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసింది వైసీపీ నేతల బృందం.. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేసింది. ఏపీలో బిహార్ సంస్కృతి తీసుకురావొద్దని కూటమి నేతల్ని హెచ్చరించారు వైసీపీ నేతలు.

వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం

మరోవైపు వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి వైసీపీ కార్యాలయం మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని జగన్ వైసీపీ ముఖ్య నేతలను ఆదేశించారు. కాగా, ఇకపై వైసీపీ కేంద్ర కార్యాలయంగా జగన్ క్యాంప్ ఆఫీస్ మారిపోనుంది.

ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..

దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌. గెలిచిన 48 గంటల్లోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్‌. టీడీపీ కార్యకర్తలు దాడులు ఆపకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..