YCP vs Janasena: ఏపీలో గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు..!

|

Oct 02, 2021 | 6:47 PM

సమయం కోసం చూస్తున్నది ఒకరు. అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఇంకొకరు.. ఒకరిది అధికారంలో ఉండే సాధకబాధక సమస్య.. ఇంకొకరిది రాజకీయంగా ఉనికి పోరాటం.

YCP vs Janasena: ఏపీలో గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు..!
Janasena Vs Ycp
Follow us on

YCP vs Janasena Road Politics: సమయం కోసం చూస్తున్నది ఒకరు. అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఇంకొకరు.. ఒకరిది అధికారంలో ఉండే సాధకబాధక సమస్య.. ఇంకొకరిది రాజకీయంగా ఉనికి పోరాటం… ఇద్దరి మధ్య నడుస్తున్న రాజకీయంలో జరుగుతున్న నష్టం ఎవరికి? కలుగుతున్న ప్రయోజనం ఏంటి? ఇదే ఇప్పుడు ఏపీలో నడుస్తున్న దారీ తెన్నూ లేని అసలైన రోడ్డు రాజకీయం.

ఏపీలో రోడ్లపై గుంతల విషయంలో జనసేన కార్యాచరణ ప్రకటించింది. కదనరంగంలో దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్.. శ్రమదానం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. స్వయంగా తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన స్వయంగా పాల్గొన్నారు. దీంతో ఆయనకు సంఘీభావంగా వేలాది మంది కార్యకర్తలు సంఘీభావంగా నిలిచారు. పన్నుల రూపంలో మనీ వసూలు చేసిన ప్రభుత్వానికి రోడ్లు మరమ్మత్తులు చేసే బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు పవన్‌ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. సంక్షేమ పథకాల పేరుతో జనాలకు పప్పు, బెల్లాలు పంచడం కాదని.. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలంటున్నారు జనసేనాని. శ్రమదానం చేయడానికి వస్తున్నామని తెలిసి రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ రోడ్లు ఒక్కటే కాదని.. మొత్తం రాష్ట్రంలో గోతులు పడ్డ రోడ్లన్నీ బాగు చేయాలన్నారు. లక్షా 26వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నా.. కిలోమీటర్లు కూడా గుంత లేని రహదారి చూపించగలరా అని జనసేన బాస్‌ ప్రశ్నిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీ గట్టిగానే తిప్పికొడుతోంది. కెమెరా… యాక్షన్.. కట్‌ స్టార్‌ పవన్‌ వచ్చి చేసే శ్రమదానం ఇదని అంటోంది వైసీపీ. రోడ్లు బాగుచేయాలంటే టెక్నికల్‌ అంశాలు ముడిపడి ఉంటాయన్నారు ప్రభుత్వం పెద్దలు. పవన్‌ వస్తున్నారని భయపడి రోడ్లు బాగుచేసినట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోవిడ్‌ నిబంధనలు అందరికీ సమానమే. ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల ఇబ్బంది పడేది ప్రజలే. అక్టోబర్‌లో కోవిడ్‌ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకానీ పవన్‌ టూర్‌ని ఆపాల్సిన అవసరం తమకు లేదన్నారు. రోడ్ల గుంతలు పూడ్చేందుకు సీఎం వైఎస్ జగన్‌ ఇప్పటికే 2వేల 200 కోట్ల రూపాయలు కేటాయించారని సజ్జల గుర్తు చేశారు. వర్షాలు పడుతుంటే రోడ్లు మరమ్మత్తులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేశారని, ఈ తరహా శ్రమదానం పవన్‌ ఒక్కరే చేయగలరేమో అంటూ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. పవన్‌ గోతులు పూడ్చడం కాదు.. రాజకీయంగా గోతులు తీస్తున్నారని మండిపడ్డారు.

రోడ్లపై గుంతలు పూడ్చే విషయంలో రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా.. సాంకేతిక నిపుణులు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జనసేన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల గుంతలను మట్టితో కప్పాలని నిర్ణయించింది. అయితే, ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు JNU ప్రొఫెసర్లు. సాంకేతికంగా నిపుణుల పర్యవేక్షణలో రోడ్ల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని గుంతలు భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. పైగా వర్షాకాలంగా చేయడం వల్ల రోడ్ల మరింత దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎవరూ తొందరపడటం మంచిది కాదంటున్నారు. ప్రమాదాలకు కారణమవుతాయని అంటున్నారు.

మొత్తానికి రోడ్ల వ్యవహారంలో ప్రభుత్వం వర్షాలు తగ్గిన తర్వాత మరమ్మత్తులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిచేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి అక్టోబర్‌ తర్వాత వచ్చే సీజన్‌ లో పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలని సమయం కోసం చూస్తోంది. అయితే, దీనినే అనుకూలంగా మలుచుకని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నాయి విపక్షాలు. ఎవరి గోలవారిదే. తాజాగా పవన్ చేపట్టిన శ్రమదాన రాజకీయం ఎటువైపు దారితీస్తుందోనని రాజకీయవేత్తలు ఆలోచనల్లోపడ్డారు.

Read Also… Crime News: పొలం పనుల కోసం వెళ్లి శవమై కనిపించిన నలుగురు కుటుంబసభ్యులు.. పోలీసుల విచారణలో సంచలనాలు!