Husband Murder Case: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మర్డర్ స్కెచ్‌ చూశారా?

మానవ బంధాలు నానాటికీ పెలుసుబారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మాంగళ్య బంధాన్ని కాపాడుకోవడం కోసం, పతి దేవుడు నూరేళ్ల ఆయుష్షు కోసం సతులు వ్రతాలు, పూజలు, నోములు చేసేవారు. కానీ నేటి పరిస్థితి తలకిందులైంది. వెనకా ముందూ ఏమాత్రం ఆలోచించకుండా కట్టుకున్నోడిని కాటికి పంపేస్తున్నారు భార్యమణులు. ఇప్పటికే ఇలాంటి ఉదంతాలు దేశ వ్యాప్తంగా పలు చోట్ల సంచలనం సృష్టించాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది..

Husband Murder Case: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మర్డర్ స్కెచ్‌ చూశారా?
Srikakulam Husband Murder Case

Updated on: Aug 15, 2025 | 12:38 PM

పాతపట్నం, ఆగస్ట్‌ 15: ప్రియుడి మోజులో మాంగళ్య బంధం అడ్డుగా ఉందన్న కారణంగా ఓ భార్య.. మర్డర్ స్కెచ్‌ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి చేతులు దులిపేసుకుంది. కానీ చేసిన పాపం వెంటాడటంతో ప్రియుడితోపాటు కటకటాల పాలైంది. ఈ షాకింగ్‌ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం పాతపట్నంలోని మొండిగొల్లవీధికి చెందిన నల్లి రాజు (34)కు ఎనిమిదేళ్ల కిందట మౌనిక అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. అయితే మౌనికకు స్థానికంగా ఉండే గుండు ఉదయ్‌ కుమార్‌తో ఇటీవల వివాహేతర సంబంధం ఏర్పడింది. అటు ఉదయ్‌కుమార్‌కు కూడా అప్పటికే వివాహం జరిగింది. వీరి వ్యవహారం మోనిక భర్తకు తెలియడంతో తీరు మార్చుకోవాలని భార్యను పలుమార్లు మందలించాడు. అయితే మౌనికలో మార్పురాకపోగా ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించాలని ప్లాన్‌ వేసింది. ఉదయ్‌కుమార్‌ కూడా తన భార్యకు విడాకులిచ్చి ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయ్‌ కుమార్‌ ఆడవేషం ధరించి రాజును రాత్రి వేళ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడానికి వాట్సప్‌లో మెసేజ్‌లు పంపించాడు. రాజు తిరస్కరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. రాజు మత్తులో ఉండగా ఇంట్లోనే చంపాలని మరో కుట్ర పన్నారు. అనంతరం ఇంట్లోనే రెండు రోజుల పాటు మౌనిక భర్త రాజుకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. ఆగస్టు 5వ తేదీన అర్ధరాత్రి రాజు నిద్రపోయిన తర్వాత ఉదయ్‌తోపాటు మల్లిఖార్జున్‌ అనే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి పిలిపించింది. నిద్రలో ఉన్న రాజు కాళ్లను మౌనిక, మల్లిఖార్జున్ కదలకుండా గట్టిగా పట్టుకోగా, ఉదయ్ అతని ముఖంపై దిండుతో అదిమి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశారు.

ఆ తర్వాత రాజు బైక్‌ను స్థానిక ఎస్సీ కాలనీలో ఉంచారు. ఉదయ్, మల్లికార్జున్‌లు మరో బైక్‌పై రాజు మృతదేహాన్ని తీసుకొచ్చి రాజు బైక్‌ ఉంచిన ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. ఈ తర్వాత భర్త కనిపించడంలేదంటూ మోనిక కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి నాటకం మొదలెట్టింది. ఆగస్టు 7న ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుపెట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు గుట్టురట్టైంది. దీంతో ఉదయ్‌కుమార్, మల్లికార్జున్‌తోపాటు మోనికను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.