
ప్రకాశం జిల్లాలో తన గొర్రెలను మేపేందుకు తీసుకెళ్లిన ఓ యజమానికి ఊహించని పరిణామం ఎదురైంది. 15 అడుగుల ఓ భారీ కొండ చిలువ ఓ గొర్రె పిల్లలను మింగి.. జీర్ణం అవ్వపోవడంతో దాన్ని బయటకు ఊసేసింది. అది చూసిన యజమానికి భయంతో వణికి పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. బల్లికురవ మండలం బొప్పూడివారిపాలెం గ్రామానికి చెందిన తోట గంగయ్య అనే వ్యక్తి గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తాడు. అయితే ఇటీవల అతను కొన్ని గొర్రె పిల్లలను పాకలోనే ఉంచి మిగతా గొర్రెల మందను మేతకు తీసుకెళ్లాడు.
అయితే వాటిని మేపుకొని తిరిగి వచ్చిన అతని పాక సమీపంలో ఊహించని సీన్ కనిపించింది.15 అడుగుల ఓ భారీ కొండచిలువ గొర్రెపిల్లని మింగి.. జీర్ణం కాకపోవడంతో తిరిగి బయటకు వదిలేసింది. ఆ తర్వాత అస్వస్థతకు గురైన ఆ కొండ చిలువ కదలలేక అక్కడే పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన గంగయ్య షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. అది విన్న స్థానికులు ఒక వేళ అదే కొండచిలువ గ్రామంలోకి వచ్చి చిన్నపిల్లలను మింగి ఉంటే జరిగే దారుణాన్ని తలచుకుని హడలిపోయారు.
రెడ్డన్నపల్లిలో మరో కొండచిలువ కలకలం.
ఈ ఘటన మరువక ముందే కురిచేడు మండలం పడమర గంగవరం పంచాయతీ పరిధిలోని రెడ్డన్నపల్లి గ్రామంలో ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. ఆలయ సమీపంలో ఓ 10 అడగులు భారీ కొండ చిలువ కనిపించడం గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. ఇది ఆ గడ్డివాములో గుడ్లు పెట్టి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. కొండచిలువతో పాటు గడ్డివాములో ఉన్న 20 గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. కొండచిలువను, గుడ్లను సమీపంలోని అటవీప్రాంతంలోకి వదిలేశారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.