
అమరావతి: విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. ఐటీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి క్యూ కడుతుండటంతో త్వరలోనే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి. అతి కొద్ది కాలంలోనే విశాఖ డేటా సెంటర్ల హబ్గా రూపుదిద్దుకోనుంది. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 12న విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది.
రాష్ట్రంలో సాంకేతిక రంగం అభివృద్ధిలో భాగంగా మంత్రి నారా లోకేష్ నాస్ డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) నిర్మించబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది.
ఈ డేటా సెంటర్లలో వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ.. ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంతో పాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్ లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సీఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పనిచేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి