Vijayasai Reddy : వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకోం, రాజ్యసభ చర్చలో తేల్చి చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభలో గళం విప్పింది వైసీపీ. ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు...

Vijayasai Reddy :  వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకోం,  రాజ్యసభ చర్చలో తేల్చి చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy

Updated on: Mar 22, 2021 | 9:06 PM

Vijayasai Reddy : విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభలో గళం విప్పింది వైసీపీ. ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్టీల్‌ ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్స్‌ను కేటాయించాలని, అప్పులను ఈక్విటీగా మార్చాలని కోరారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా విజయసాయి విశాఖ స్టీల్ పై మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరించడం మంచిదికాదన్నారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా భాసిల్లుతున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఒక్క కలం పోటుతో ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత మాత్రం సమర్ధించబోదన్నారు.

నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనానికి అవసరమైన ప్రణాళిక, చర్యలను రూపొందించడానికి బదులుగా వాటిని ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానం సరికాదని విజయసాయి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు తమపై ఉంచిన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశలో పని చేస్తాయని విజయసాయి సభలో చెప్పుకొచ్చారు. ప్రైవేట్‌ సంస్థలకు మైనింగ్‌ హక్కులు కట్టబెట్టడం తప్పు లేదు.. కానీ ముందుగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు సంపూర్ణంగా జరిగిన తర్వాత మాత్రమే మిగిలిన గనులను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని విజయసాయి సూచించారు.

Read also : KTR vs Piyush Goyal : ‘మా సంగతేంటి సారూ’.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీడియోకి మంత్రి కేటీఆర్ రియాక్షన్