
తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హరితహారంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించనున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ మీడియాకు వెల్లడించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గంగుల వివరించారు.
కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా కరీంనగర్ పట్టణంలో 24 గంటల త్రాగు నీటి పథకానికి, ఐటీ టవర్ను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కరీంనగర్కు తలమానికంగా తయారవుతున్న కేబుల్ బ్రిడ్జిని కేటీఆర్ పరిశీలిస్తారని వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ ద్వారా 3,500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. కేటీఆర్ పర్యటనలో మొదట హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.