
విజయవాడ నగరంలో జరిగిన గ్యాంగ్వార్కి సంబంధించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో ప్రముఖంగా ఉన్న తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతో పాటు వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు వీరిద్దరు కూడా టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ముఖ్య అనుచరలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట సందీప్, పండు మంచి స్నేహితులు అయినప్పటికీ.. విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్లుగా విడిపోయినట్లు సమాచారం. ఇక గుంటూరు జిల్లాలోని వివాదస్పద భూముల వ్యవహారంలోనూ ఈ రెండు వర్గాల జోక్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
కాగా విజయవాడ గ్యాంగ్వార్లో రెండు జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో సందీప్, పండులకు ఉన్న టిక్టాక్, ఫేస్బుక్ అకౌంట్ల ఫాలోవర్స్ను కూడా విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శనివారం విజయవాడలోని పటమటలో జరిగిన గ్యాంగ్ వార్లో సందీప్, పండులతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స తీసుకుంటూ సందీప్ మరణించగా.. పండు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Read This Story Also: పవన్ ‘వకీల్ సాబ్’.. మరో మూడు నెలలు పట్టనుందా..!