పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీల వ్యవహారంలో హైకోర్టు స్పందించింది. మంథని మండలం వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గత నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్ పై హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై న్యాయవాది గట్టు వెంకట నాగమణి కోర్టుకు లేఖ రాశారు. భూగర్భ జలాలు అడుగంటుతుండగా, రైతులతో బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న వ్యవహారాన్ని, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక రవాణా జరపడాన్ని లేఖలో వివరించారు.
సుమారు రూ.50 కోట్ల విలువైన ఇసుకను రూ.5 కోట్లకు అప్పగించడంపై వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని ఆమె లేఖలో విన్నవించారు. ఈ లేఖను పిల్గా స్వీకరించిన హైకోర్టు (జూన్ 22) సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా వరకు 9 మంది అధికారులను, శాఖలను ప్రతి వాదులుగా చేర్చింది. గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాని నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర 14 ఇసుక క్వారీ మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. అయితే తదుపరి విచారణ కోసం కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.