గత 6 నెలలుగా దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా దేవాలయాలను కూడా మూసివేశారు. కాగా, అన్లాక్ 2.0తో ఇప్పుడిప్పుడే తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. పలు ఆలయాల్లో పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తుండగా, ఇప్పుడు శ్రావణ మాసం కూడా వచ్చేసింది. మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కరోనా పరిస్థితుల్లోవర్చువల్ విధానంలో వ్రతాలు నిర్వహించనుంది.
తిరుపతిలోని తినుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 31న వర్చువల్ విధానంలో వరలక్ష్మీ వ్రతాలు జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్రతంలో పాల్గొనేవారు టికెట్లను కొనేందుకు వీలుగా ఆన్లైన్ విధానంలో గోవింద మొబైల్ యాప్ని అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అలా బుక్ చేసుకున్న వారికి టీటీడీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పూజా సామాగ్రిని సప్లై చేయనున్నట్లు తెలిపారు.
వరలక్ష్మీ వ్రతంలో కావాల్సిన పూజా సామాగ్రి ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అక్షితలు, కంకణాలు అమ్మవారి మూలవిరాట్టు పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని వరలక్ష్మీ వ్రతం టికెట్లు పొందిన భక్తులకు అందజేస్తున్నారు. జులై 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ వరలక్ష్మీ అమ్మవారి వ్రతం… SVBCలో లైవ్లో వస్తుంది. వ్రతంలో పాల్గొనే భక్తులు… అర్చకులు చెప్పినట్లుగా చేస్తూ… తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుందని చెప్పారు.